- తెలంగాణ, ఏపీని.. ఇండియా, పాకిస్తాన్లా విభజించారు.. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు
- మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
- గతంలో ‘తల్లిని చంపి బిడ్డను బతికించారని’ వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ
- తేజస్వి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంత్రి పొన్నం లేఖ
- మతిలేని మాటలు.. రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చెబుతరు: ఎంపీ వంశీకృష్ణ
- బీజేపీ ఎంపీ సోయి ఉండే మాట్లాడారా?: కడియం కావ్య
- అహంకార వ్యాఖ్యలు.. రాష్ట్ర ఏర్పాటును పాక్ విభజనతో పోలుస్తరా?: కేటీఆర్
- ఆరు దశాబ్దాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడ్తవా?: కవిత
- తెలంగాణను అవమానించే ఉద్దేశం తేజస్వికి లేదు: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ అక్కసు మరోసారి బయటపడింది. ఆ పార్టీకి చెందిన కర్నాటక నేత, ఎంపీ తేజస్వి సూర్య గురువారం లోక్ సభలో మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్ర విభజనను తప్పుబట్టేలా విమర్శలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చారు. బ్రిటిషర్స్ కంటే చెత్తగా తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని.. ఆనాడు ఇండియా, పాకిస్తాన్ విభజన మాదిరిగా తెలంగాణ, ఏపీని విభజించారని.. ఆ సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని విమర్శించారు.
గతంలో ప్రధాని మోదీ సైతం పార్లమెంట్ వేదికగా.. తెలంగాణ ఏర్పాటును ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. మరోసారి.. తలుపులు మూసి ఏపీని విభజించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే, డీలిమిటేషన్పై ప్రతిపక్షాలు దక్షిణాది రాష్ట్రాల ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని తేజస్వి ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని ఈ తరహా కొత్తదారులు వెతుకుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ ఫార్ములాను సభలో తేజస్వి కొట్టిపారేశారు. సీట్ల సంఖ్య ఆదారంగా జీడీపీకి ముడిపెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి సలహా అత్యంత తెలివితక్కువైనదన్నారు. అలాంటి ప్రతిపాదనతో ముందుకెళితే ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అన్న రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రానికి విలువే ఉండదన్నారు.
అసలు ఆయనకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ.. దీన్ని చూసి తెలంగాణ ప్రజలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల ఆదాయం ఏటా మారుతూ ఉంటుందని, దానిని డీలిమిటేషన్కు ప్రతిపాదికగా తీసుకోవడం సరికాదన్నారు. ఆదాయం ప్రకారం ఓట్లు ఇవ్వాలని అనుకుంటే.. దేశంలో అంత్యంత ఆదాయం ఉన్న అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాల్సి వస్తుందని సెటైర్లు వేశారు.
- తేజస్వీ వ్యాఖ్యల కాంగ్రెస్ ఫైర్..
తేజస్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు తేజస్వీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి వ్యాఖ్యలు మరోసారి బీజేపీ అక్కసును బయటపెట్టాయని మండిప డ్డారు. అసలు సంబంధమే లేని అంశంలో తెలంగాణ విభజనను తీసుకురావడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రోద్భలంతోనే తేజస్వి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు.
ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను ఎంపీ వక్రీక రిస్తున్నా.. రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు స్పందించక పోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీతో పాటు తేజస్వి సూర్య, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

