జనగామ జడ్పీ చైర్మన్‌‌.. పాగాల హఠాన్మరణం

జనగామ జడ్పీ చైర్మన్‌‌.. పాగాల హఠాన్మరణం

హైదరాబాద్​/జనగామ/ స్టేషన్​ ఘన్​పూర్,​ వెలుగు: జనగామ జెడ్పీ చైర్మన్​, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్​ రెడ్డి(54) సోమవారం రాత్రి హఠాన్మరణం చెందారు. హనుమకొండలోని తన నివాసంలో సాయంత్రం చాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్​ కు తరలించినా ప్రాణం దక్కలేదు. తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన పాగాల మృతి.. బీఆర్​ఎస్​ నేతలతో పాటు, జిల్లా వాసుల్లో తీవ్ర విషాదం నింపింది. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంకు చెందిన సంపత్​ రెడ్డి హనుమకొండలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం స్టేషన్​ ఘన్​పూర్​లో తాజాగా గెలుపొందిన ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ప్రెస్​మీట్​లో పాల్గొన్నారు.

అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంట్లో టీ తాగుతూ.. చాతిలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే దగ్గర్లోని రోహిణి హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ట్రీట్​ మెంట్​ తీసుకుంటూ చనిపోయారు. సంపత్​ రెడ్డి కుమారుడు సాయి 2010లో హనుమకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య సుజాత ఉన్నారు. కూతురు సంజన అమెరికాలో ఉద్యోగం చేస్తోంది.  

ఉద్యమ కారుడి కోటాలో జెడ్పీ చైర్మన్

2019లో స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ పరిధిలోని చిల్పూరు జెడ్పీటీసీగా గెలుపొందిన పాగాల.. ఉద్యమ కారుడి కోటాలో జనగామ జెడ్పీ చైర్మన్​గా నియామకం అయ్యారు.​ పార్టీలో మంచి  గుర్తింపు తెచ్చుకోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా చేపట్టిన పార్టీ అధ్యక్షుల ఎంపికలో పాగాలకు జనగామ జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్ష పదవి దక్కింది. 2022, ఫిబ్రవరి 11న జనగామ కలెక్టరేట్​ ఓపెనింగ్​ కు వచ్చిన సీఎం కేసీఆర్​ అదే రోజు జిల్లా పార్టీ ఆఫీస్ ను ప్రారంభించి పాగాలను కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి అటు జెడ్పీ చైర్మన్​గా, ఇటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి కి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. 2002 నుంచి 2006 వరకు ఉమ్మడి వరంగల్​ జిల్లా పార్టీ యువజన విభాగం ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2006 నుంచి 2013 వరకు స్టేషన్​ ఘన్​పూర్​ మండల పార్టీ అధ్యక్షుడిగా, 2013 నుంచి 2015 వరకు స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ ఇంచార్జ్​గా కూడా పనిచేశారు. 

ఆర్నెళ్లు కూడా గడవక ముందే మరో జెడ్పీ చైర్మన్​

ములుగు జెడ్పీ చైర్మన్​, ఆ జిల్లా బీఆర్​ఎస్ అధ్యక్షుడు కుసుమ జగదీశ్​ ఇదే యేడాది జూన్​ 11న గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన జరిగి ఆర్నెళ్లు కూడా గడవక ముందే జనగామ జెడ్పీ చైర్మన్​, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్​ రెడ్డి కూడా గుండెపోటుతోనే అకాల మరణం చెందడం బీఆర్​ఎస్​లో తీవ్ర విషాదం నింపింది. ఆదివారం వెలువడిన ఎలక్షన్​ రిజల్ట్స్​ తో రాష్ట్రంలో అధికారం కోల్పోయి బాధలో ఉన్న పార్టీ శ్రేణులను పాగాల మృతి ఘటన మరింత శోక సంధ్రంలో ముంచింది. పాగాల డెడ్​బాడీని హనుమకొండ నుంచి సొంత గ్రామం రాజవరం తరలించారు. 

పాగాల మృతి బాధాకరం : కేసీఆర్​

పాగాల సంపత్​రెడ్డి మృతి బాధకరమని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి తన వెంట నడిచారని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ సీనియర్​నేతలు కేటీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్​కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్​బండా ప్రకాశ్​ తదితరులు సంపత్​రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. జనగామ, స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్​ రెడ్డి, కడియం శ్రీహరి పాగాల మృతిదేహాన్ని  సందర్శించి నివాళులు అర్పించారు.