
- మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రైతన్నల సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల వద్ద కొన్న జొన్న పంట డబ్బులను వెంటనే విడుదల చేసి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలన్నారు. రైతు బీమా పథకానికి కనీసం ప్రీమియం చెల్లించే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు.
గత నాలుగైదు నెలల్లోనే నలుగురు రైతులు చనిపోతే వారికి రైతు బీమా అందలేదని, బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నర్సింగ్ రావు, మెట్టు ప్రహ్లాద్, నాయకులు గండ్రత్ రమేశ్, రాజన్న, సతీశ్, కుమ్ర రాజు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.