
- కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్కు లేఖ
- కేసీఆర్ విజ్ఞప్తికి కమిషన్ ఓకే.. 11కు ఎంక్వైరీ వాయిదా
- హరీశ్రావు విచారణ అయ్యాక వెళ్తేనే మేలని భావిస్తున్న కేసీఆర్!
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ తేదీని మార్చాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కమిషన్కు లేఖ రాశారు. తొలుత ఈ నెల 5న
విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు కమిషన్ నోటీసులు పంపించింది. 6న ఈటల రాజేందర్, 9న హరీశ్రావును విచారణకు పిలిచింది. దీనిపై కేసీఆర్తో ఇప్పటికే పలుమార్లు హరీశ్ రావు భేటీ అయి, చర్చించారు. ఇంతలోనే తాను 5న హాజరు కాలేనని, ఆ రోజు వేరే వ్యక్తిగత పనులున్నాయని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. 11న విచారణకు హాజరవుతానని, ఎంక్వైరీని ఆ తేదీకి మార్చాలని కమిషన్కు ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జ్యుడీషియల్ కమిషన్.. ఆయన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
హరీశ్రావు తర్వాతే వెళ్లాలని..
ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టును గత నెల 21న సమర్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా గత నెల 19న కమిషన్ గడువును ప్రభుత్వం 2 నెలలు పొడిగించింది.
ఆ మరుసటి రోజే కేసీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్కు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే కేసీఆర్తోపాటు హరీశ్రావు.. పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు, విచారణకు హాజరైన అధికారులతోనూ కమిషన్ విచారణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారన్న టాక్ నడుస్తున్నది. కమిషన్ ఏం ప్రశ్నలు అడుగుతున్నది? ఎలాంటి సమాధానాలు చెప్పాలి? లాంటి వాటి గురించి ఆరా తీశారని సమాచారం.
అంతేగాకుండా ప్రభుత్వపరంగా ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్, హరీశ్ రావు కూడా చర్చించుకున్నారన్న చర్చ నడుస్తున్నది. విచారణకు 5న హాజరు కావాలని కేసీఆర్ తొలుత నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఆయన తేదీ మార్చాలని కోరడంతో.. కమిషన్ అందుకు తగ్గట్టే నిర్ణయం తీసుకున్నది. అయితే, హరీశ్ విచారణ జరిగిన తర్వాతే తాను హాజరయ్యేలా విచారణ తేదీని కేసీఆర్ కోరినట్టు తెలిసింది. హరీశ్ విచారణకు ముందు వెళ్తే.. అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంది? జడ్జి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు? లాంటి అంశాలను తెలుసుకునేందుకు వీలవుతుందని కేసీఆర్ భావించినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే విచారణ తేదీని వాయిదా వేయాలని కమిషన్ను కేసీఆర్ కోరారని తెలుస్తున్నది.