5న రాలేను.. 11కు మార్చండి.. విచారణ తేదీని మార్చాలని కేసీఆర్​ వినతి

5న రాలేను.. 11కు మార్చండి.. విచారణ తేదీని మార్చాలని కేసీఆర్​ వినతి
  • కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​కు లేఖ
  • కేసీఆర్​ విజ్ఞప్తికి కమిషన్​ ఓకే.. 11కు ఎంక్వైరీ వాయిదా
  • హరీశ్​రావు విచారణ అయ్యాక వెళ్తేనే మేలని భావిస్తున్న కేసీఆర్!

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ విచారణ తేదీని మార్చాలని మాజీ సీఎం, బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కమిషన్​కు లేఖ రాశారు. తొలుత ఈ నెల 5న 
విచారణకు హాజరు కావాలని కేసీఆర్​కు కమిషన్​ నోటీసులు పంపించింది. 6న ఈటల రాజేందర్​, 9న హరీశ్​రావును విచారణకు పిలిచింది. దీనిపై కేసీఆర్​తో ఇప్పటికే పలుమార్లు హరీశ్​ రావు భేటీ అయి, చర్చించారు. ఇంతలోనే తాను 5న హాజరు కాలేనని, ఆ రోజు వేరే వ్యక్తిగత పనులున్నాయని  కాళేశ్వరం కమిషన్​కు కేసీఆర్​ చెప్పినట్టు తెలిసింది.  11న విచారణకు హాజరవుతానని, ఎంక్వైరీని ఆ తేదీకి మార్చాలని కమిషన్​కు ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కేసీఆర్​ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జ్యుడీషియల్​ కమిషన్​.. ఆయన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. 

హరీశ్​రావు తర్వాతే వెళ్లాలని..

ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్​ రిపోర్టును  గత నెల 21న సమర్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా గత నెల 19న కమిషన్​ గడువును  ప్రభుత్వం  2 నెలలు పొడిగించింది. 
ఆ మరుసటి రోజే కేసీఆర్, హరీశ్​రావు, ఈటల రాజేందర్​కు కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే కేసీఆర్​తోపాటు హరీశ్​రావు.. పలువురు రిటైర్డ్​ ఇంజనీర్లు, విచారణకు హాజరైన అధికారులతోనూ కమిషన్​ విచారణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారన్న టాక్​ నడుస్తున్నది. కమిషన్​ ఏం ప్రశ్నలు అడుగుతున్నది? ఎలాంటి సమాధానాలు చెప్పాలి? లాంటి వాటి గురించి ఆరా తీశారని సమాచారం. 

అంతేగాకుండా ప్రభుత్వపరంగా ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్, హరీశ్ రావు కూడా చర్చించుకున్నారన్న చర్చ నడుస్తున్నది.  విచారణకు 5న హాజరు కావాలని కేసీఆర్ తొలుత​ నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఆయన తేదీ మార్చాలని కోరడంతో.. కమిషన్​ అందుకు తగ్గట్టే నిర్ణయం తీసుకున్నది. అయితే, హరీశ్​ విచారణ జరిగిన తర్వాతే తాను హాజరయ్యేలా  విచారణ తేదీని కేసీఆర్​ కోరినట్టు తెలిసింది. హరీశ్​ విచారణకు ముందు వెళ్తే.. అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంది? జడ్జి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు? లాంటి అంశాలను తెలుసుకునేందుకు వీలవుతుందని కేసీఆర్​ భావించినట్టు తెలుస్తున్నది.  అందులో భాగంగానే విచారణ తేదీని వాయిదా వేయాలని కమిషన్​ను కేసీఆర్ ​కోరారని తెలుస్తున్నది.