బ్రాహ్మణుల పిలక ఎంత పవిత్రమైనదనేది.. మోహన్ బాబుకి జీవితంలో తెలియదు: రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ శర్మ

బ్రాహ్మణుల పిలక ఎంత పవిత్రమైనదనేది.. మోహన్ బాబుకి జీవితంలో తెలియదు: రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ శర్మ

మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' వివాదంలో మునిగింది. గతేడాది సెప్టెంబర్లో కన్నప్ప నుంచి 'పిలక గిలక' అనే హ‌స్య పాత్రలను పరిచయం చేశారు. ఇందులో 'పిలక గిలక' పాత్రలను పోషిస్తున్న బ్రహ్మానందం, స‌ప్తగిరిల‌కు సంబంధించిన పోస్టరు రిలీజ్ చేశారు. ఇపుడీ ఈ పిలక గిలక పాత్రపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. తమ మనోభావాలను కించపరుస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పలు డిమాండ్స్ వ్యక్తపరిచారు. నేడు (జూన్ 7న) గుంటూరులో నిర్వహిస్తున్న కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను అడ్డుకుంటామని హెచ్చరించాడు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో, శర్మ ఈ చిత్రంలో బ్రాహ్మణుల చిత్రీకరణకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని మోహన్ బాబు మరియు విష్ణులను కోరారు.

శ్రీధర్ శర్మ మాటల్లోనే.. 'కన్నప్ప సినిమాకు సంబంధించి పిలక గిలక అనే పోస్టరు బ్రాహ్మణులను తీవ్రంగా కించపరిచే విధంగా ఉంది. ఈ సన్నివేశాలు తొలగించాలంటూ కోర్టుని ఆశ్రయించాము. ఇప్పటివరకు సెంట్రల్ ఫిలిం బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలోనూ మోహన్ బాబు అనేక సినిమాలలో బ్రాహ్మణులను కించపరిచే పాత్రలను పోషించారు. బ్రాహ్మణుల పిలక ఎంత పవిత్రమైనదనేది మోహన్ బాబుకి జీవితంలో తెలియదు. అంతేకాకుండా హైదరాబాదులో గతంలో బ్రాహ్మణులపై మోహన్ బాబు, విష్ణు దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

పిలక గిలక పోస్టర్ పై సినీ పెద్దలు సైతం స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాట్లాడిన సినీ పెద్దలకు.. కన్నప్ప సినిమాలో ఉన్న దారుణ సన్నివేశాలు కనిపించడం లేదా?' అని శ్రీధర్ శర్మ ప్రశ్నించారు.

అలాగే 'మోహన్ బాబు కుటుంబ సభ్యుల సినిమాల ప్రారంభానికి పూజలు చేస్తుంది కూడా బ్రాహ్మణులే అనే విషయాన్ని మర్చిపోవొద్దని సూచించారు. అలాంటి బ్రాహ్మణులపై కించపరుస్తూ సన్నివేశాలు తీయటం సినిమా వారికి ఎంతవరకు సమంజసం? దమ్ముంటే సినిమా హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు వారి కులాలకు సంబంధించిన సినిమాలు తియ్యగలరా?' అని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ శర్మ ప్రశ్నించాడు. మరి ఈ విషయంపై సినీ పరిశ్రమ, మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, సప్తగిరి ఇతరలు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.