కేసీఆర్, మోడీ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారైన్రు

కేసీఆర్, మోడీ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారైన్రు

రాష్ట్రంలో కేసీఆర్ కూడా బీజేపీ  విధానాలనే అవలంభిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో గాంధీ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, టీపీసీసీ నాయకులు వినోద్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి... గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన వ్యక్తి మహాత్మాగాంధేనని చెప్పారు. ప్రపంచానికి ఆదర్శంగా మన భారతీయుడు ఉండటం గర్వకారణమన్న ఆయన... మర పిరంగులతో రాజ్యాలను ఏలుతున్న బ్రిటీషర్లపై శాంతియుత పోరాటం చేసిన మహనీయడు గాంధీ అని కొనియాడారు. దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై అనే నినాదంతో గాంధీజీ స్వాతంత్ర్యం అందించారని చెప్పారు. గాంధీ స్ఫూర్తితో నెహ్రూ గారు హరిత విప్లవం తీసుకొచ్చారని, సాగునీటిని రైతులకందించి దేశంలో దారిద్ర్యంను పారదోలారన్నారు. 

బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించి అణగారిన వర్గాలకు అధికారం అందించింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పారు. బీజేపీ విషవృక్షం దేశాన్ని కబలించాలని చూస్తోందన్న ఆయన.. కేసీఆర్, మోడీ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని విమర్శించారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ముందుకు రావాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల మధ్య విద్వేషపు గోడలు నిర్మించాలని చూస్తున్నారని, చవకబారు నేతల విభజించు పాలించు విధానాలను తిప్పికొట్టేందుకె రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రం రాహుల్ యాత్రకు అండగా నిలుస్తుందన్న ఆయన... గాంధీ స్ఫూర్తితో మనందరం భారత్ జోడో యాత్రలో కదం కదం కలపాలని పిలుపునిచ్చారు.