
- ఇరిగేషన్ గురించి కేసీఆర్ను అడగడం.. హనుమంతుడి ముందు కుప్పిగంతులే: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వాగులు, వంకలు, నదులు, చెరువులపై కేసీఆర్కు ఉన్న అవగాహన.. దేశంలో మరే నాయకుడికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. కేసీఆర్ను పిలిచి ఇరిగేషన్ గురించి అడగడమంటే.. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టేనని అన్నారు. బుధవారం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన టైంలో.. బీఆర్కే భవన్ బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఓ ఐదు నిమిషాలు కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటో తెలుసుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని వేరే దేశంలో కడితే కేసీఆర్తో పాటు ఆ ప్రాజెక్ట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదన్నారు. కానీ, ఇక్కడ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ల కుట్ర రాజకీయాల్లో పావుగా మారిందన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసింగ్ వంటి విషయాలను ముందుపెట్టి 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ఆరోపించారు.
ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల దృష్టిని మళ్లించలేరన్నారు. తమను ఎన్ని రకాలుగా వేధించినా వదిలిపెట్టబోమని, కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలు తాత్కాలికమేనని, తెలంగాణను సాధించి సస్యశ్యామల నేలగా మార్చిన కేసీఆర్ను వేధిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ధర్మం, న్యాయమే గెలుస్తుందని, నిజాలు బయటికి వస్తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.