
- మంత్రి జూపల్లి కృష్ణారావు
- గోపాల్ దీన్నె లింకు కెనాల్ కు శంకుస్థాపన
వీపనగండ్ల, వెలుగు: సింగోటం రిజర్వాయర్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరందేలా కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు మాటిచ్చారు. శనివారం ఆయన వీపనగండ్ల మండల పరిధిలోని సగినేనిపల్లి గ్రామంలో రూ.120 కోట్లతో గోపాల్ దీన్నె సింగోటం లింకు కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదన్నారు. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగోటం రిజర్వాయర్ లింకు కెనాల్ ను రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సగినేనిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, చిన్నంబావి మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ యాదవ్, వీపనగండ్ల మాజీ జడ్పీటీసీ కృష్ణ ప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేశ్, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డిపాల్గొన్నారు.