
- ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథి కార్యకలాపాలపై జూపల్లి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఆర్ట్ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, దాని నిర్వహణను మెరుగుపర్చాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో సోమవారం మంత్రి ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథి సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్ట్ గ్యాలరీని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.
చిత్రకారులు, కళాకారులు దీనిని మరింత సద్వినియోగం చేసుకునేలా కళాప్రియులు, ప్రజలు, పర్యాటకులు ఎక్కువగా సందర్శించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కళాసారథుల వేతనాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాసారథి కార్యాలయంలో ఉన్న ఆడియో–వీడియో స్టూడియోలో సౌండ్ ప్రూఫింగ్ పనులను తక్షణమే చేపట్టాలన్నారు. సమీక్షలో సాంస్కృతిక కళాసారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొన్నారు.