గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి.. ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తిచేస్తం:మంత్రి పొన్నం

గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి.. ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తిచేస్తం:మంత్రి పొన్నం
  • హైదరాబాద్ సిటీలో మరో 2,200ల ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి.. గెలిచిన ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి.. విలీన ప్రక్రియను పూర్తిచేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం బస్​ భవన్ లో వెయ్యి రోజుల ప్రజా పాలనలో రవాణా శాఖ ప్రగతిని మీడియాకు మంత్రి వివరించారు. ఏపీలో విలీనం సందర్భంగా ఏర్పడిన ఇబ్బందులు, తెలంగాణలో ఏర్పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

ఆర్టీసీలో 4,538 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, అందులో వెయ్యి డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక పోస్టుల నియామకాలు పూర్తయ్యాయన్నారు.  తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,932 బస్సులు కొనుగోలు చేశామని, ఇందులో 1,024 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో హైదరాబాద్ సిటీలో మరో 2,200 ల ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించనున్నట్టు వివరించారు. పీఎం ఈ డ్రైవ్ కింద ఇప్పటికే 240 డీజిల్ బస్సులను రెట్రోఫిట్ చేస్తున్నామన్నారు. 

హైదరాబాద్​లో కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు 1,400 కోట్ల పన్నును ప్రభుత్వం నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేయించామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ప్రయాణించి రూ.12,167 కోట్లు ఆదా చేసుకున్నారన్నారు. విజన్.. 2047 కు అనుగుణంగా ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో రవాణా రంగంలో పలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని తెలిపారు.

7న కార్మిక సంఘాలతో భేటీ

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియను కార్మిక శాఖ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 7న మధ్యాహ్నం 3:30 గంటలకు 11 గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో కార్మిక శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించడం, పాల్గొనే యూనియన్ల గుర్తింపు, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌పై ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీ ఎన్నికల దిశగా ఇది కీలకమైన ముందడుగు అని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారు.