
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్రావుకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ అయ్యింది. దీంతో ఆయన వన్ టైమ్ ఎంట్రీపై అమెరికా నుంచి ఇండియాకు రానున్నాడు. సిట్ అధికారులకు అందిన సమాచారం మేరకు అమెరికా నుంచి శనివారం బయలుదేరి ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకోనున్నాడు.
సోమవారం ఉదయం సిట్ ఎదుట హాజరుకానున్నట్టు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో గత వారం రోజులుగా నెలకొన్న సస్పెన్స్ వీడింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం ఆయనకు ఊరట కల్పిస్తూ వారం రోజుల క్రితమే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. దాంతో ఆయన అమెరికాలోని ఇండియన్ ఎంబసీని ఆశ్రయించాడు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.