
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలను పట్టించుకోవడం లేదని సోషల్ డెమోక్రటిక్ ఫోరం స్టేట్ కన్వీనర్, మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళీ ఆరోపించారు. రైతు బంధు పేరిట విదేశాల్లో ఉన్న కోటీశ్వరులకు కూడా డబ్బులు ఇస్తున్నారని... .కాళేశ్వరం పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కానీ స్కూళ్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగొడ్ స్కూల్ను ఆయన సందర్శించారు. పాఠశాల పక్కన జేసీబీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని చెప్పారు. ఇద్దరు విద్యార్ధుల మృతి ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లనే ఇద్దరు విద్యార్థులు చనిపోయారని విమర్శించారు. విద్యార్థుల మృతికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఎందుకు అందించడం లేదని ఆకునూరి మురళీ ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది పిల్లలు చనిపోయాక ప్రభుత్వం స్పందింస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.