
- జిల్లాలో వందకు పైగా బాధితులు
- పరిహారం సరిగా వస్తలే..?
- కులాంతర వివాహాలకు అందని ప్రోత్సాహం
- నేడు జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాక
- రిపోర్ట్రెడీ చేసిన ఆఫీసర్లు
యాదాద్రి, వెలుగు : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పేరుకుపోతున్నాయి. దీంతో బాధితుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతోపాటు పరిహారం కూడా అందడం లేదు. కులాంతర పెండ్లిళ్లు చేసుకున్న వారికి ప్రోత్సాహం సైతం అందడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు అవమానాలు, వారిపై జరిగే దాడులు, అఘాయిత్యాలను అరికట్టడానికి1989లో కేంద్ర ప్రభుత్వం అట్రాసిటీ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటాగా బాధితులకు కేసును బట్టి ప్రభుత్వపరంగా మూడు విడుతల్లో రూ.లక్ష ఆపై మొత్తాన్ని పరిహారంగా అందించాల్సి ఉంటుంది.
దూషించిన కేసుల్లో రూ.లక్ష, రేప్ అండ్ మర్డర్ కేసుల్లో రూ.8 లక్షల వరకు పరిహారంగా నిర్ణయించారు. రూల్స్ ప్రకారం అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైన వెంటనే కేసును బట్టి పరిహారంలో 25 శాతం, పోలీసులు కోర్టుల్లో చార్జిషీట్ వేసిన తర్వాత 50 శాతం, శిక్ష ఖరారైన తర్వాత మరో 25 శాతం బాధితులకు అందించాల్సి ఉంటుంది.
100కు పైగా కేసులు..
యాదాద్రి జిల్లాలో మొత్తంగా వందకుపైగా అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. వీటిలో కులం పేరుతో దూషించడం, అత్యాచారయత్నాలతోపాటు రేప్ అండ్ మర్డర్ కేసులు ఉన్నాయి. అయితే అట్రాసిటీ కేసుల్లో సత్వరం పరిష్కారం లభించడం లేదు. జిల్లా ఏర్పడి దశాబ్దం గడిచినా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కాలేదు. నల్గొండలోనే ఫాస్ట్ ట్రాక్కోర్టు ఉండడం వల్ల కేసుల విచారణ కోసం బాధితులు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది.
కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అవి పరిష్కారం కావడం లేదు. రూల్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు కాగానే నిర్ణయించిన పరిహారం 25 శాతం అందించాల్సి ఉన్నా.. అది అందడం లేదు. కొందరికి చార్జిషీట్ వేసిన తర్వాత కూడా పరిహారం అందడం లేదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన ఈ కేసులకు మొత్తంగా రూ.50 లక్షలకు పైగా పరిహారం అందించాల్సి ఉంది.
కులాంతర వివాహాలకు..
ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ప్రోత్సాహం అందడం లేదు. కులాంతర పెండ్లి చేసుకున్న వారికి రూ.2.50 లక్షలు ప్రోత్సాహంగా అందించాల్సి ఉంది. అయితే జిల్లాలో దాదాపు 100 మంది కులాంతర పెండ్లిళ్లు చేసుకున్నా వారికి ప్రోత్సాహం అందలేదు. ప్రోత్సాహం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
పరిహారం అందని బాధితుల ఉదాహారణలు..
అసభ్యంగా కులం పేరుతో దూషించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళకు రూ.2 లక్షలు పరిహారంగా నిర్ణయించారు. ఇందులో ఆమెకు రూ.20 వేలు అందాయి. చార్జిషీటు వేసిన తర్వాత రావాల్సిన వాయిదా మొత్తం రాలేదు. మరో మహిళ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఆమెకు రూ.50 వేలు అందగా, చార్జిషీటు వేసిన తర్వాత రావాల్సిన అమౌంట్ రాలేదు. ఇలా అనేక కేసులు ఉన్నాయి.
నేడు కమిషన్ రాక.. కేసులపై రివ్యూ..
ఎస్సీ, ఎస్టీ స్టేట్ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నేతృత్వంలో ఐదుగురు మెంబర్లు శనివారం యాదాద్రికి వస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆయా కులాలకు కలిగిన లబ్ధి, అందిన సబ్సిడీ వంటి వివరాలు తెలుసుకోనున్నారు. అట్రాసిటీ కేసులు, పరిహారం, ప్రోత్సాహాలపై రివ్యూ నిర్వహిస్తారు. దీంతో కలెక్టర్ హనుమంతరావు తొమ్మిది డిపార్ట్మెంట్లతో శుక్రవారం అత్యవసరం మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని అంశాలపై పూర్తి వివరాలతో కూడిన రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు.