
సీజనల్గా దొరికే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండు రుచితో పాటు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. సీతాఫలంతో పాటు ఈ చెట్టు పువ్వు, వేర్లు, ఆకులు, బెరడును ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి వాడతారు. సీతాఫలాన్ని రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్తున్నాడు డాక్టర్ సంజయ్ సేతి.
యాపిల్లో కంటే సీతాఫలంలోనే క్యాలరీలు ఎక్కువ. దానివల్ల శరీరానికి కావాల్సిన శక్తి త్వరగా అందుతుంది. పొటాషియం కండరాల బలహీనతను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సీతాఫలం పొడిని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే డయేరియా తగ్గుతుంది.ఇందులోని మెగ్నీషియం, సోడియం, పొటాషియం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది. సీతా ఫలంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అల్సర్లను తగ్గించి ఎసిడిటీని పోగొడతాయి. కడుపులో ఇన్ఫెక్షన్స్ రానీయదు. 100 గ్రాముల సీతాఫలంలో ఒక యాపిల్లో ఉండేదానికన్నా ఎక్కువ ఫైబర్, ఆరెంజ్లో కన్నా ఎక్కువ విటమిన్–సి ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ట్యూమర్, యాంటీ ఒబెసిటీ, యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ రోగాల నుంచి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తాయి. కాన్సర్, కరొనరీ హార్ట్ డిసీజ్ల బారిన పడకుండా చేస్తాయి.
థయమిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్– బి6 ఉంటాయి. ఇవి న్యూరాన్లలో కెమికల్ లెవల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచి డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తాయి.
సీతాఫలాన్ని తేనెతో కలిపి తింటే ఈజీగా బరువు పెరగొచ్చు. చర్మం పొడిబారడాన్ని, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. సీతాఫలం గింజలు, పొట్టులో అనోనాసిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. పార్కిసన్స్ మెడిసిన్ వాడేవాళ్లు సీతాఫలం తినకూడదు.