
గద్వాల, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా పోలీసులకు దొరికిపోయారు. హత్యకు గురైన తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సుజాత, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, మేనేజర్ డ్రైవర్ నగేశ్తో పాటు సుపారి గ్యాంగ్ కు సంబంధించిన నలుగురు వ్యక్తులతో కలిపి 8 మందిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
గద్వాల రూరల్, ఇటిక్యాల పోలీస్ స్టేషన్లలో నిందితులను వేర్వేరుగా విచారించి హత్యకు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎంక్వైరీని పరిశీలించారు. ఇదిలాఉంటే తిరుమల రావు భార్యను, ఐశ్వర్య భర్తను చంపేసిన తరువాత ఎవరికీ దొరకకుండా సుదూర ప్రాంతానికి వెళ్లి హాయిగా బతకాలని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
అతడిని చంపేశారా ?
తేజేశ్వర్ అత్త సుజాతకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురికి మేనమామతో పెళ్లి చేశారు. చిన్న కూతురుకు పెళ్లి చేయాలని చూసినా కుదరలేదు. కొడుకు నవీన్ కర్నూల్ లో ఆటో నడుపుతూ బతుకుతున్నాడు. తల్లి, అక్క వ్యవహారం నచ్చక వారితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో రెండు నెలల కింద ఇంట్లో కాలుజారి కిందపడి చనిపోయాడు. కానీ, తల్లి, కూతురు, ప్రియుడే చంపేసి కాలుజారి చనిపోయినట్లు క్రియేట్ చేశారనే ఆరోపణలున్నాయి. ఆ కేసు నుంచి తప్పించుకున్న వీరు, ఆ తరువాత సర్వేయర్ తేజేశ్వర్ హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.