ఇకపై లేట్ ముచ్చట్లు ఉండవు.. ఉద్యోగులపై సీఎం విజయ్ సంచలన నిర్ణయం..

ఇకపై లేట్ ముచ్చట్లు ఉండవు.. ఉద్యోగులపై సీఎం విజయ్ సంచలన నిర్ణయం..

తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులు టైమ్‌కి ఆఫీస్‌కి వచ్చేలా చూడటం కోసం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. జూన్ 1 నుంచి స్టేట్ సెక్రటేరియట్ లోని 'హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్‌మెంట్' (HRM) శాఖలో పనిచేసే ఆఫీసర్లు, సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడి  అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరి చేసింది.

సెక్రటేరియట్‌లో ఇలాంటి డిజిటల్ సిస్టమ్‌ను అధికారికంగా తీసుకురావడం ఇదే మొదటిసారి. కొత్త రూల్ తో ఉద్యోగులందరూ ఉదయం 10 గంటల లోపు ఆఫీస్‌కి వచ్చి, ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ ద్వారా  అటెండెన్స్  ఎంటర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ కొత్త డిజిటల్ పద్ధతితో పాటు, పాత పద్ధతిలో రిజిస్టర్‌లో సంతకం  కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నంత సేపు ఉద్యోగులందరూ ఖచ్చితంగా  ఆఫీస్ ఐడి కార్డ్స్ ధరించాలి.

ఈ నిర్ణయానికి కారణం:
ప్రభుత్వ ఆఫీసుల్లో క్రమశిక్షణ పెంచడం, ఉద్యోగులు సమయానికి వచ్చేలా చేయడం, పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడమే ఈ కొత్త విధానం  ముఖ్య ఉద్దేశ్యం.

గతంలో అభ్యంతరాలు
నిజానికి ఈ సిస్టమ్‌ను గతంలోనే  ట్రయల్ రన్ పరిశీలించారు. కానీ, అప్పట్లో కొంతమంది ఉద్యోగులు కొన్ని అభ్యంతరాలు, ఆందోళనలు తెలపడంతో దీన్ని కాస్త ఆలస్యంగా అమలు చేశారు. ఇప్పుడు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి, పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు.

 ప్రస్తుతం ఈ విధానాన్ని కేవలం HRM శాఖలోనే పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో దీనిని దశలవారీగా సెక్రటేరియట్‌లోని మిగతా అన్ని శాఖలకు కూడా విస్తరిస్తారు.

ఇప్పటికే 'ఆహార, సహకార' వంటి కొన్ని ఇతర శాఖలు కూడా టైం విషయంలో కఠినమైన రూల్స్ పెట్టాయి. ఈ శాఖల్లోని స్టాఫ్ ఉదయం 9:50లోపు, ఆఫీస్ హెల్పర్లు ఉదయం 9:30లోగా  ఆఫీస్‌కు రావాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే అక్కడ ఇంకా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టలేదు, కానీ భవిష్యత్తులో అక్కడ కూడా తెచ్చే అవకాశం ఉంది.