
- హైదరాబాద్కు కొకైన్ సప్లయ్ చేస్తున్న పబ్ డీజే అరెస్ట్
- పర్రా ఏరియాలోని పబ్బులు, నైజీరియన్ల స్థావరాల్లో సోదాలు
- గోవాలోని నైజీరియన్ల లిస్టులో హైదరాబాద్ కస్టమర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, అల్ర్ఫాజోలం సహా ఇతర మాదకదక ద్రవ్యాలను అరికట్టేందుకు టీజీ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. గోవా పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ హైదరాబాద్కు కొకైన్ సప్లయ్ చేస్తున్న డీజే వనిష్ టక్కర్, సప్లయర్ బాలకృష్ణను అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. వివరాలను డైరెక్టర్ సందీప్ శాండిల్యా శనివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న డ్రగ్స్ సప్లయర్ల కాంటాక్ట్స్, కస్టమర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా టీజీ ఏఎన్బీ అధికారులు గోవాలో సోదాలు నిర్వహించారు.
గోవా పర్రాలోని పబ్లో డీజేగా పనిచేస్తున్న వనిష్ టక్కర్.. హైదరాబాద్, బెంగళూరు, థాణేకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇందుకోసం ఏఎన్బీ టాస్క్ఫోర్స్ టీమ్స్ గోవాలోని పర్రా ఏరియాలో నెల రోజుల పాటు రెక్కి నిర్వహించాయి. గోవా పోలీసులు సహకారంతో అరెస్ట్ చేశాయి. గోవా పర్రాలోని నలుగురు నైజీరియన్ల వద్ద హైదరాబాద్ సహా బెంగళూరు, కేరళకు చెందిన 40 మంది కస్టమర్లకు సంబంధించిన లిస్టును టీజీ ఏఎన్బీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే గతేడాది ఫిల్మ్నగర్లోని సంక్చరీ పబ్ డీజే ఆపరేటర్ డీజే స్వదీప్ కాంటాక్ట్ లిస్టును సేకరించారు. హైదారబాద్లోని సంపన్నులు, యువతకు కొకైన్ సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించారు. స్వదీప్కు కూడా గోవా నుంచి డ్రగ్స్ సప్లయ్ అవుతున్నట్లు ఆధారాలు సేకరించారు. ఆపరేషన్ గోవాలో భాగంగా ఈనెల 1న స్థానిక హైలాండ్ పార్క్ అపార్ట్మెంట్, సంగీత మొబైల్ షాప్ లపై నిఘా పెట్టారు. 4న పార్క్ అపార్ట్మెంటులో సోదాలు చేశారు. నైజీరియాకు తరలించేందుకు వాషింగ్ మెషీన్లో ప్యాక్ చేసిన రూ.50 లక్షలు సీజ్ చేశారు.
హవాలా కోసం 50 మంది నైజీరియన్లు
గోవాలో దాదాపు 50 మంది నైజీరియన్లు పనిచేస్తున్నారు. మ్యాక్స్ నెట్వర్క్లో ఉన్న హవాలా వ్యాపారులు ఉత్తమ్ సింగ్, రాజు సింగ్, మహేందర్ ప్రజాపతిలను అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద రూ.49.65 లక్షలు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నైజీరియన్ను అరెస్ట్ చేసి రూ.1.64 కోట్లు విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో ఏప్రిల్ 8న కల్తీకల్లు తాగి 70 మంది అస్వస్థతకు గురైన కేసుకు సంబంధించి ఆల్ర్ఫాజోలం తయారు చేస్తున్న కంపెనీలపై టీజీ ఏఎన్బీ అధికారులు దాడులు నిర్వహించారు.