పోలీసుల నిర్బంధంలో ఉన్న మావోయిస్టులను కోర్టులో హాజరుపర్చాలి

పోలీసుల నిర్బంధంలో ఉన్న మావోయిస్టులను కోర్టులో హాజరుపర్చాలి
  • తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు:  నిర్బంధంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. శనివారం  హైదరాబాద్ లోని హైదర్ గూడలో  సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలోని పర్షఘడ్ గ్రామంలో ఈనెల 5న సుమారు పదిమంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గ్రామస్తులు  తెలిపారని సంఘం  నాయకులు పేర్కొన్నారు. 

అందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలార ఆడేళ్లు భాస్కర్ తో పాటు పదిమంది మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. అరెస్టు చేసిన మావోయిస్టులపై సమాచారం ఇవ్వకుండా ఎన్ కౌంటర్ చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ తో వందలాదిమంది ఆదివాసులు, ఉద్యమకారులను  కాల్చి చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలతో అదుపులోకి తీసుకున్నవారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టకుండా చిత్రహింసలకు గురిచేసి ఎన్‌‌ కౌంటర్ పేరుతో ప్రాణాలు తీయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.