
- ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
- కేబినెట్ నిర్ణయాల పట్ల మంత్రి పొంగులేటిని కలిసి ధన్యవాదాలు
హైదరాబాద్, వెలుగు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కేబినెట్ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉద్యోగులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని శుక్రవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. జీపీవోలకు నియామకపత్రాలు అందజేయాలని కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లచ్చిరెడ్డి మాట్లాడారు.
ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నదని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను పునరుద్ధరించాలన్నారు. సీనియార్టీ ఆధారంగా ఇతర జోన్లు/జిల్లాకుల బదిలీ అయిన ఉద్యోగులను, వారు ముందుగా పని చేసిన ప్రాంతాల్లో... భవిష్యత్లో వచ్చే ఖాళీల్లో తిరిగి తీసుకోవాలని కోరారు. త్రిసభ్య కమిటీ దృష్టికి వచ్చిన ఇతర అంశాలను పరిశీలించాలన్నారు. రెండు డీఏల చెల్లింపు, హెల్త్ స్కీమ్ అమలుకు ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయమని తెలిపారు. జీపీవోలకు నియామకపత్రాలు అందజేసే విషయంలో మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారని, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ కో- చైర్మన్లు కే రామకృష్ణ, ఎస్ రాములు, కే హన్మంత్ రావు, దేవేందర్, జి కృపాకర్, కే రాములు, బాణాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.