పండ్ల షాపుల తొలగింపులో ఉద్రిక్తత

పండ్ల షాపుల తొలగింపులో ఉద్రిక్తత

పాలమూరు, వెలుగు: మహబూబ్​నగర్ పట్టణంలోని ఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన  షాపుల ముందు పండ్ల దుకాణాలను తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఏడాది క్రితం మహబూబ్​నగర్ ఆర్టీసీ బస్టాండ్ లో  20 షాపులను నిర్మించి ఆన్​లైన్ ద్వారా అద్దె ప్రాతిపాదికన టెండర్లను నిర్వహించారు. ఒక్కో షాపునకు రూ.45 వేల నుంచి రూ.50 వేల అద్దె నిర్ణయించారు. ఇందుకోసం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డిపాజిట్ కూడా చేయించుకున్నారు. 

అయితే షాపులు తీసుకున్న వారు వారి షాపుల ముందు అదనంగా పండ్ల షాపులు నడుపుతున్నారు. వాటిని తొలగించాలని మూడు నెలల క్రితమే డిపో మేనేజర్ సుజాత వ్యాపారులను పిలిపించి చెప్పారు. అయినా వినకపోవడంతో శనివారం ఆర్టీసీ అధికారులు... మునిసిపల్​, పోలీసు సిబ్బందితో అక్కడికి వచ్చారు. జేసీబీలతో షాపులను తొలగిస్తుండగా వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. ఎంఐఎం నాయకులు అక్కడికి చేరుకుని ఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపివేశారు.