యాదిలో.. రవీంద్రుడు విశ్వకవి మాత్రమే కాదు..

యాదిలో.. రవీంద్రుడు విశ్వకవి మాత్రమే కాదు..

ప్రపంచమంతటా ఉన్న విద్యావంతులకు రవీంద్రనాథ్​ఠాగూర్‌‌‌‌ పేరు సుపరిచితం. ఆయన1861 మే 6న పుట్టాడు. చిన్నతనంలోనే తల్లి దూరమైంది. తండ్రి ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. ఠాగూర్‌‌ బాగోగులన్నీ ఆ ఇంటి నౌకర్లే చూసుకునేవాళ్లు. ఆయనకు నడక వచ్చినప్పటినుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. పద్దెనిమిది ఏండ్లు నిండకముందే ఎన్నో కవితలు, వచన రచనలను ప్రచురించాడు. ‘భారతి’ అనే మ్యాగజైన్‌‌లో ఠాగూర్‌‌‌‌ రాసిన ఎన్నో ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి. ‘లెటర్స్‌‌ ఆఫ్​ ఏ ట్రావెలర్‌‌‌‌ టు యూరోప్‌‌’ అనే వ్యాసంలో పాశ్చాత్య దేశాల్లో తన అనుభవాల గురించి వివరించాడు. ఆ తర్వాత ఆయన రాసిన గేయాలు కూడా ప్రసిద్ధి చెందాయి. 

అప్పట్లో తన స్నేహితులు ఠాగూర్‌‌ని సరదాగా ‘బెంగాలీ షెల్లీ’ అని పిలిచేవాళ్లు. ఆయన 1883 డిసెంబర్‌‌‌‌లో మృణాలినీ దేవిని పెండ్లి చేసుకున్నాడు. ఆయనకు ఆ టైంలోనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీతో మంచి స్నేహం ఏర్పడింది. కానీ.. కొన్ని కారణాలతో ఆ స్నేహం దూరమైంది. అప్పటినుంచి ఠాగూర్‌‌‌‌ కవితల్లో ‘మృత్యువు’ ఆలోచనలు కనిపిస్తాయి.1887లో ఆయన ఘజీపూర్‌‌‌‌కి వెళ్లి తన మొట్టమొదటి పరిపక్వ రచన ‘మానసి’ రాశాడు. ఆ తర్వాత వాళ్ల ఎస్టేట్‌‌ వ్యవహారాలు చూసుకోవడానికి షిలీడాకు వెళ్లాడు. అక్కడి పల్లె జనాలతో మమేకమయ్యాడు. అక్కడి ప్రకృతి, పొలాలు, కాలువలు, బాతులు, రెల్లుపొదలను అందంగా వర్ణించాడు. 

అక్కడే తనను తాను మొదటి శ్రేణి నాటక కర్తగా మలుచుకున్నాడు. ‘శాక్రిఫైస్‌‌’ బెంగాలీ సాహిత్యంలో గొప్ప నాటకంగా పేరుతెచ్చుకుంది. ‘చిత్రాంగద’ శిఖరాగ్రం లాంటిది.1896 నుంచి ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. అప్పుడే బ్రిటిష్‌‌ పాలనను తీవ్రంగా నిరసించడం మొదలైంది.  
1901లో బోల్పూర్‌‌‌‌కు రెండు మైళ్ల దూరంలో  ‘శాంతినికేతన్‌‌’ పాఠశాలను స్థాపించాడు. తర్వాత అది ఒక ఆదర్శ పాఠశాలగా మారింది. కొన్నేండ్లలోనే ఠాగూర్ భార్య, రెండో కూతురు, తండ్రి దేవేంద్రనాథ్, పెద్ద కొడుకు మరణించారు. వరుసగా తగిలిన ఈ గాయాల తాలూకూ బాధ ఆయన కవితలు ‘స్మరణ్​’, ‘ఖేయ’లో ప్రతిబింబించింది. ఆ టైంలోనే ఆయన ఎన్నో నవలలు రాశాడు. వాటిలో ‘గోరా’ ఒకటి. 

బెంగాల్‌‌ విభజన టైంలో రవీంద్రుడు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. తన వ్యాసాలతో ప్రజలను చైతన్యవంతులను చేశాడు. ఆయన రాసిన దేశభక్తి గీతాలను ఎంతోమంది పాడేవాళ్లు. అయినా.. కొంతమంది నిందలకు గురయ్యాడు. దాంతో శాంతినికేతన్‌‌కు వెళ్లిపోయాడు. అక్కడే ఆయన వసంతోత్సవం, చీకటి గృహం, పోస్ట్‌‌ ఆఫీస్‌‌ నాటికలతోపాటు గీతాంజలి అనే కవితా సంకలనం కూడా రాశాడు. ఆ తర్వాత 1912లో ఇంగ్లాండ్‌‌కు వెళ్లాడు. అక్కడ ఉన్నప్పుడే ‘గీతాంజలి’ ప్రత్యేక ఎడిషన్‌‌ వచ్చింది. దానిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. 1913లో  ‘నోబెల్‌‌ సాహితీ పురస్కారం’ దక్కడంతో ఆయనను ప్రపంచం గుర్తించింది. కలకత్తా యూనివర్సిటీ ‘అకడెమిక్‌‌ లారెన్స్‌‌’తో సత్కరించింది. 1914లో ‘నైట్‌‌హుడ్‌‌’ ఇచ్చారు. ఆ సంవత్సరాల్లోనే తోటమాలి, నెలవంక, వసంత రుతుభ్రమణం, ఇల్లు మరియు ప్రపంచం లాంటివి రాశాడు.

 అయితే.. 1919లో అమృత్‌‌సర్‌‌‌‌లో జరిగిన కాల్పులను నిరసిస్తూ ‘నైట్‌‌హుడ్​’ బిరుదుని తిరిగి ఇచ్చేశాడు. 
1920 వరకు ఆయన కీర్తి విదేశాల్లో బాగా పెరిగిపోయింది. అందుకే ఠాగూర్‌‌‌‌ యూరప్‌‌, అమెరికాలతోపాటు ఇతర దేశాల్లో ఎన్నో లెక్చర్‌‌‌‌ టూర్స్‌‌ చేశాడు. దాంతో ఆయనకు లెక్కలేనంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ఠాగూర్ సాహిత్యంలో సాధించినది మిగతావాటన్నింటినీ అధిగమించింది. ఆయన కేవలం కవి మాత్రమే కాదు. నాటక కర్త, నవలా రచయిత, సంగీతకారుడు,  చిత్రకారుడు, తత్వవేత్త, విలేకరి, ఉపాధ్యాయుడు, వక్త.. ఇంకా ఎన్నో విషయాలు తెలిసిన మేధావి.