ఉపాధ్యాయుల ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో నిలిపివేసి 13 జిల్లాలో ఖాళీలకు అనుగుణంగా 615 మంది స్పౌజ్ బదిలీలకు విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం సూర్యపేట మినహా మిగతా 12 జిల్లాల్లోని దంపతులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. మొత్తంగా 427 మంది బదిలీ కానున్నారు. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని ఇటీవల టీచర్లు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరో వైపు రేపటి నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలోని టీచర్ల బదిలీలకు సంబంధించిన జీవో నెం. 5 ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇవాళ ఉదయం జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తులను ఆన్ లైన్ ఈ నెల 28 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.