- ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలపై పెరుగుతున్న వ్యతిరేకత
- ఒక్కో నియోజకవర్గంలో రెండు, మూడు గ్రూపులు
- ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మోత్కుపల్లి
- నర్సింహులుకు మద్దతుగా నిలుస్తున్న అసంతృప్తులు ?
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా అధికార పార్టీలో గ్రూపుల లొల్లి పెరిగిపోతోంది. భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత పట్ల ఆ పార్టీలో రోజురోజుకు వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. పార్టీలో ముందు నుంచి ఉన్న లీడర్లు ఓ వర్గంగా కొనసాగుతుండగా, టీఆర్ఎస్లో టీడీపీ, కాంగ్రెస్ లీడర్లు ఎవరికి వారే గ్రూపులు కడుతున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో కింది స్థాయి కేడర్ రెండు, మూడు గ్రూపులుగా విడిపోయింది.
కేడర్ను, లీడర్లనూ పట్టించుకోని పైళ్ల
మాజీమంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, కాంగ్రెస్ లీడర్ చింతల వెంకటేశ్వరరెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత భువనగిరి నియోజకవర్గంలో గ్రూపులు పెరిగాయి. వీరిద్దరూ ఆయా పార్టీల్లో బలమైన నేతలు అయినప్పటికీ టీఆర్ఎస్లో చేరాక సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ ఇద్దరు లీడర్ల అనుచరులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి వ్యూహాత్మకంగా పక్కన పెట్టారు. ఉమామాధవరెడ్డి కొడుకు సందీప్రెడ్డి జడ్పీ చైర్మన్ అయినా అతడి అనుచరులకు పార్టీ కమిటీల్లో చోటు దక్కలేదు. గతేడాది జరిగిన పీఏసీఎస్ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సందీప్రెడ్డి వర్గానికి చెందిన వారు కొన్నిచోట్ల పోటీ చేసి గెలిచారు. ఇటీవల ఏర్పాటు చేసిన గ్రామ, మండల కమిటీల్లో సందీప్రెడ్డి వర్గానికి చెందిన వారికి ప్రయారిటీ ఇవ్వకపోవడంతో కొన్ని గ్రామాల్లో ఎవరికి వారు సొంత కమిటీలను వేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన చింతల వెంకటేశ్వర్రెడ్డిని అసలు పట్టించుకోవడమే మానేశారు. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్నే అంటిపెట్టుకొని ఉన్న లీడర్లను సైతం పక్కన పెట్టేశారు. పార్టీపరంగా, వ్యక్తిగతంగా సమస్యలు ఎదుర్కొంటున్న కేడర్కు శేఖర్రెడ్డి అందుబాటులో ఉండడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ‘కేడర్తో నాకేం పని, డబ్బుంటే చాలు గెలిచేస్తామన్నట్లుగా’ పైళ్ల వ్యవహరిస్తున్నారని, అందుకే ఎవరినీ పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. మరో వైపు తాను ఓడిపోవడానికి పరోక్షంగా పైళ్ల శేఖర్రెడ్డే కారణమని భావిస్తున్న మరో ముఖ్య నేత సైతం అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఆలేరులో ఏకపక్షంగా కమిటీల ఏర్పాటు
మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్లో చేరకముందు ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కాస్త మెరుగ్గానే కనిపించింది. ఆయన చేరాక టీఆర్ఎస్ బలం పెరగకపోగా గ్రూపులు తయారయ్యాయి. భిక్షమయ్య వర్గీయులకు టీఆర్ఎస్లో సరైన ప్రయారిటీ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే గొంగిడి సునీత పట్ల వ్యతిరేకత పెరుగుతూ పోయింది. భిక్షమయ్య అనుచరులతో పాటు, మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారిని సైతం పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలో అసంతృప్తులు పెరిగిపోయారు. ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఎమ్మెల్యే గొంగిడి దంపతులు ఏకపక్షంగా వ్యవహరించారని టీఆర్ఎస్ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇచ్చి, ఉద్యమకాలం నుంచి ఉన్న వారిని నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు. తుర్కపల్లి మండల కమిటీ ఎన్నిక టైంలో కార్యకర్తలు కోరుకున్న పడాల శ్రీనివాస్కు కాకుండా నరేందర్రెడ్డి బాధ్యతలు అప్పగించడంతో గొడవ స్టార్ట్ అయింది. ఇది చివరకు నలుగురిని సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఈ పంచాయతీ ప్రస్తుతం మంత్రి కేటీఆర్ దగ్గరకు చేరింది. తుర్కపల్లి మండలంలోని గ్రామ శాఖ కమిటీలు పడాల వెంట నిలవడంతో తనకంటూ ఓ టీమ్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. ఆలేరు, రాజాపేట, ఆత్మకూర్ (ఎం), మోటకొండూరు సహా పలు మండలాల్లో కమిటీల ఏర్పాటులో ఇలాగే వ్యవహరించారని టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు.
మోత్కుపల్లి చేరికతో సునీతకు చెక్?
ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు బలమైన నేత. ఆలేరు, తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఆలేరుతో పాటు భువనగిరి నియోజకవర్గంలోనూ అనుచరులు ఉన్నారు. ఆయన పార్టీలో చేరిన రోజు రెండు నియోజకవర్గాలకు చెందిన లీడర్లు హైదరాబాద్కు తరలివెళ్లారు. ఇందుకు టీఆర్ఎస్లోని కొందరు అసంతృప్తులే వెహికల్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్ సైతం మోత్కుపల్లిని తన వెంటే తిప్పుకున్నారు. మోత్కుపల్లి చేరిక, కేసీఆర్ ఆయనకు ఇచ్చిన ప్రయారిటీని చూస్తుంటే ఎమ్మెల్యే గొంగిడి సునీతకు త్వరలోనే చెక్ పడనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యే టికెట్లపై మొదలైన చర్చ
ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలు టీఆర్ఎస్లో చేరుతుండడంతో వచ్చే ఎన్నికల్లో తమకు ఎక్కడ పోటీ అవుతారోనని ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత ఆందోళనలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కొత్త వారికే టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతుండడంతో తమ భవిష్యత్పై ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకుందని టీఆర్ఎస్ లీడర్లే చెబుతున్నారు. భువనగిరి టికెట్ను ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి సైతం ఆశిస్తున్నట్లు సమాచారం. కాగా తాను ఓడిపోవడానికి పైళ్లే శేఖర్రెడ్డే కారణమని భావిస్తున్న ఓ నేత సైతం ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారని అనుకుంటున్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవితో పాటు, ఆలేరు అసెంబ్లీ టికెట్ను ఆశిస్తున్నారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన పడాల శ్రీనివాస్ కూడా పార్టీలో తనకు బలమైన నాయకుడి మద్దతు ఉందని, అతడి ద్వారా టికెట్ తెచ్చుకుంటానని చెప్పుకుంటున్నారు. ఒక వేళ ఆలేరు స్థానాన్ని మోత్కుపల్లి కావాలనుకుంటే ఆయనకు టికెట్ దక్కడం ఖాయమేనని పార్టీ లీడర్లు అనుకుంటున్నారు.