కేంద్ర మంత్రి పియూష్ గోయల్
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగంలో ఇండియా సాధించిన ప్రగతిని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మెచ్చుకున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ గ్రిడ్లోకి మారడానికి తమ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. వచ్చే మూడున్నరేండ్లలో ఇండియన్ రైల్వేస్ 100 శాతం విద్యుదీకరణకు మారుతుందన్నారు. ప్రస్తుతం ఇండియాలో 40 వేల కిలో మీటర్ల (ఆర్కేఎం) పైచిలుకు ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. దీన్ని మొత్తం బ్రాడ్–గేజ్ రూట్స్లో 63 శాతంగా చెప్పొచ్చు. 2020–2021 ఏడాదిలో 7 వేల ఆర్కేఎం విద్యుదీకరణ పూర్తి చేయాలని ఇండియన్ రైల్వేస్ టార్గెట్గా నిర్దేశించుకుందని సమాచారం.
‘ప్రధాన మంత్రి ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంటర్నేషనల్ రినివబుల్ కమ్యూనిటీలో ఇండియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ సోలార్ గ్రిడ్లోకి మారడంపై మేం పని చేస్తున్నాం. పీఎం–కుసుమ్ పథకం ద్వారా రైతులను కూడా రినవబుల్ ఎనర్జీని పెంచడంలో భాగం చేయనున్నాం. వచ్చే మూడున్నర ఏండ్లలో రైల్వేస్ను వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం. తద్వారా 9 నుంచి 10 సంవత్సరాల్లో 100 శాతం నెట్ జీరో ఆపరేటర్కు వెళ్తుంది. 2030 నాటికి పౌరులుగా మనం గర్వించే స్థాయిలో ఉంటాం. అప్పటికి ప్రపంచంలోని మొట్టమొదటి పరిశుద్ధమైన రైల్వేస్ అనే పేరును మనం సొంతం చేసుకుంటాం’ అని రైల్వే మంత్రి పియూష్ జోస్యం చెప్పారు.