త్రివిధ దళాల్లో పనిచేసిన మాజీ కల్నల్ ప్రీతిపాల్ సింగ్ మృతి

త్రివిధ దళాల్లో పనిచేసిన మాజీ కల్నల్ ప్రీతిపాల్ సింగ్ మృతి

మామూలుగా  ఓ సైనికుడు ఏదో ఒక రక్షణ విభాగంలో మాత్రమే పనిచేస్తారు. సైన్యం, నావికాదళం.. లేదంటే వైమానిక దళంలోనో సేవలందిస్తారు. కానీ.. ఆ మూడు దళాల్లోనూ  ఒకే వ్యక్తి పనిచేయడ మామూలు విషయం కాదు. అలా సాధ్యం కాని విషయాన్నిసుసాధ్యం చేసిన ఏకైక సైనికాధికారి కల్నల్ ప్రీతిపాల్ సింగ్ గిల్.  త్రివిధ దళాల్లో పనిచేసిన ఏకైక సైనికుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

అంతటి ఘన చరిత్ర ఉన్న సైనికుడు చనిపోయారు. వందేళ్ల ప్రీతిపాల్ సింగ్ గిల్ ఆదివారం హర్యానాలోని చండీగఢ్ లో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచారు.  కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. రెండో ప్రపంచం యుద్ధంలోనూ ఆయన పాల్గొన్నారు. అప్పట్లో బ్రిటన్ కు అనుసంధానంగా ఉన్న రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ ఇండియన్ నేవీలో పనిచేశారు. ఆ తర్వాత భారత సైన్యంలోనూ విధులు నిర్వర్తించారు.

లాహోర్ లోని గవర్నమెంట్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. అక్కడే వాల్టన్ ఏరోడ్రోమ్ లో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. హొవార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ పై కరాచీలో ట్రైనింగ్  తీసుకున్నారు. అది అంత సురక్షితం కాదని భావించి.. ఆయన తండ్రి మేజర్ హర్పాల్ సింగ్ గిల్ అది మాన్పించేశారు. ఆ తర్వాత నేవీలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధం  క్రమంలో కార్గో షిప్ లకు ఎస్కార్ట్ గా వెళ్లే ఐఎన్ఎస్ తీర్ నౌకలో పనిచేశారు.

లాంగ్ రేంజ్ గన్నరీ కోర్స్ పూర్తయిన తర్వాత నేవీ నుంచి ఆయన బయటకొచ్చేశారు. ఆ తర్వాత గ్రేడెడ్ ఇన్ స్ట్రక్టర్ గన్నరీగా చేరారు.  స్వాతంత్ర్యం వచ్చిన కొన్నాళ్లకే గిల్ భారత ఆర్మీలో చేరారు. 1 సిక్ (ఇప్పటి 4 మెక్) రెజిమెంట్ లో డ్యూటీ చేశారు. తుపాకీ పేల్చడంలో మంచి పట్టు ఉండడంతో రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలోని గ్వాలియర్ మౌంటెయిన్ బ్యాటరీలోకి డ్యూటీ మార్చారు.