మన దేశానికి వస్తానంటున్న 1,000 కంపెనీలు

మన దేశానికి వస్తానంటున్న 1,000 కంపెనీలు

కరోనాతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న ఇండియా ఈ ఆపద నుంచి కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. ఈ వ్యాధికి పుట్టినిల్లుగా అనుమానిస్తున్న చైనా నుంచి బయటికి రావడానికి సిద్ధమైన విదేశీ కంపెనీలను ఆకర్షించ‌డంలో సక్సెస్‌ అవుతోంది. ఇదే అదనుగా మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు దాదాపు వెయ్యి విదేశీ కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. వీటిలో 300 కంపెనీలు మాన్యుఫ్యాక్చరింగ్‌‌ను చైనా నుంచి ఇండియాకు మార్చడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టేందుకు అనుమతుల కోసం ఇవి వివిధ స్థాయిల్లో దరఖాస్తులు కూడా పెట్టుకున్నాయి.

వీటిలో మొబైల్స్‌‌, ఎలక్ట్రానిక్స్‌‌, మెడికల్‌ డివైజ్‌లు, టెక్స్‌‌టైల్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. విదేశాల్లోని ఇండియా ఆఫీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇండస్ట్రీ డిపార్టుమెంట్ల దగ్గర అప్లికేషన్ లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం వెయ్యి కంపెనీలు ప్రభుత్వంతో చర్చిస్తున్నాయని సంబంధిత ఆఫీసర్‌ ఒకరు చెప్పారు. ‘‘కరోనా బెడద పూర్తిగా తొలగిపోతే చాలా కంపెనీలు ఏర్పాటు అవుతాయి. ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఎదుగుతుంది. జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియా కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడుతున్నాయి. వీటిలో చాలా వరకు ఇండియా బాట పట్టే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.

ఎన్నో ప్రోత్సాహకాలు…

విదేశాల కంపెనీలను ఆకర్షించ‌డం, కార్పొరేట్లను ప్రోత్సహించడం, దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్‌‌ను పెంచడానికి మోడీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో కార్పొరేట్‌ ట్యాక్స్‌‌ను పది శాతానికి తగ్గించడంతో ఇది 25.17 శాతానికి చేరింది. కొత్త కంపెనీలు అయితే కేవలం 17 శాతం ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఇంత తక్కువ పన్ను ఇండియాలో తప్ప ఎక్కడా లేదు. జీఎస్టీని కూడా తగ్గించడం వల్ల మరిన్ని విదేశీ ఇన్వెస్ట్‌ మెంట్లను ఆకర్షించగలమని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. చైనా మాదిరే ప్రొడక్షన్‌ కాస్ట్‌‌ను బాగా తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తికి చైనాయే కారణమంటూ అమెరికా సహా పలు దేశాలు బహిరంగంగానే విమర్శలు చేశాయి. కొన్ని దేశాలైతే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ దేశం నుంచి తమ కంపెనీలను తరలించడానికి రెండు బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇస్తామని జపాన్ ప్రకటించింది. మరిన్ని దేశాలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘అన్ని గుడ్లనూ ఒకే బుట్టలో పెట్టకూడదనే సూత్రాన్ని కంపెనీలు పాటిస్తున్నాయి. అందుకే ప్లాంట్లను ఇండియా వంటి దేశాలకు తరలించాలని కోరుకుంటున్నాయి. మనదేశానికి రావడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి’’ అని డిపార్ట్‌‌మెంట్‌ఫర్ ప్రమోషన్ ఆఫ్‌ ఇండస్ట్రీ ఇండ్ ఇంటర్నెల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ)సెక్రటరీ గురుప్రసాద్‌ మహాపాత్ర అన్నారు.