సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 10 వేలు.. ఐదంచెల భద్రతకు ఈసీ ఆదేశం

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 10 వేలు.. ఐదంచెల భద్రతకు ఈసీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 10 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్​ స్టేషన్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్​ ఫోకస్​పెట్టింది. 24గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్ తో మూడంచెల భద్రత కల్పించనుంది. ఎక్కడా  ఎలాంటి అల్లర్లు  జరగకుండా పోలీస్ శాఖ సమన్వయంతో గట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నది.

రంగంలోకి కేంద్ర బలగాలు

రాష్ట్రంలోని 8 జిల్లాల పరిధిలో 600కు పైగా పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో  ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలకు సెంట్రల్ ఫోర్సెస్ ను ఇప్పటికే రంగంలోకి దింపారు.  బెల్లంపల్లి, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు, మంథని, చెన్నూరు, సిర్పూర్ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ బలగాలను పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 166 చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.