టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కాలేదు : వికారాబాద్ డీఈవో రేణుక దేవి

టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కాలేదు : వికారాబాద్ డీఈవో రేణుక దేవి

వికారాబాద్ జిల్లా తాండూరులో పదవతరగతి ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్త కలకలం రేపింది. పరీక్షకు ముందే వాట్సాప్ లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలను వికారాబాద్ డీఈవో రేణుక దేవి ఖండించారు. ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేశారు. ఎస్ఎస్ సీ 2023 ఎగ్జామ్స్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రేణుక దేవి తెలిపారు. మొబైల్ ఫోన్స్ పూర్తిగా నిషేధించామని, తాను 4 పరీక్షా కేంద్రాలు విజిట్ చేసి వచ్చానని చెప్పారు. కానీ ఎక్కడా ఎలాంటి రిమార్క్స్ గానీ, కంప్లైంట్స్ గానీ రాలేదన్నారు. తనకు పేపర్ లీకేజీపై ఎలాంటి సమాచారం రాలేదని, తన ఫోన్ కు కూడా ఎలాంటి పేపర్ రాలేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై ఇంటలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం. వికారాబాద్ కలెక్టరేట్లో డీఈవో, విద్యాశాఖ అధికారులు సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత డీఈవో హుటాహుటిన కలెక్టరెట్ కు వెళ్లినట్టు సమాచారం.

పరీక్షకు ముందే వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టిందంటూ పలు వార్తలు వచ్చాయి. పదో తరగతి పరీక్షలు ఈ రోజు 9.30కు ప్రారంభం కాగా.. మొదటి పేపర్ తెలుగు ఉదయం 9:37కే వాట్సాప్ లో ప్రత్యక్షం అయిందంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.