ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ వద్దని తిరగబడ్డ జనం..గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రణరంగం

ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ వద్దని తిరగబడ్డ జనం..గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రణరంగం
  • 12 గ్రామాల నుంచి వచ్చిన జనం, సిబ్బందిపై దాడికి యత్నం
  • సామగ్రి, వాహనాలు ధ్వంసం, కంటెయినర్‌‌, గుడిసెలకు నిప్పు
  • పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గద్వాల, వెలుగు : గద్వాల జిల్లా రాజోలి మండలంలో జరుగుతున్న ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. నెల రోజుల నుంచి ఇటువైపు రాని కంపెనీ యాజమాన్యం.. రెండు రోజుల కింద ఫ్యాక్టరీ ఏర్పాటు పనులను మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న 12 గ్రామాల ప్రజలు మంగళవారం ఆందోళనకు దిగారు. బుధవారం ఏకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే స్థలం వద్దకు వచ్చి సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా సామగ్రిని ధ్వంసం చేసి కంటెయినర్‌‌కు నిప్పు పెట్టారు.

మొదటి నుంచీ వ్యతిరేకమే...

గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఏపీకి చెందిన గాయత్రి ఇథనాల్ ఫ్యూయల్‌‌ కంపెనీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెద్దధన్వాడ సమీపంలో 2017లో 27.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. 2024లో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రతినిధులు వచ్చారు. కాని ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల కాలుష్యంతో రోగాల పాలవుతామని, పంటపొలాలు దెబ్బతింటాయని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, సాసనూరు, మాన్‌‌దొడ్డి, చిన్న తాండ్రపాడు, రాజోలి, తుమ్మిళ్ల, కేశవరం, వేంసోంపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా మూడు నెలల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు.

తర్వాత రాజోలి తహసీల్దార్‌‌ సమక్షంలో కంపెనీ యజమాన్యం, గ్రామస్తులతో మీటింగ్‌‌ నిర్వహించగా.. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. తర్వాత గద్వాల ఆర్డీవో, డీఎస్పీ సమక్షంలో జరిగిన మీటింగ్‌‌లోనూ ఇలాంటి వ్యతిరేకతే వచ్చింది. దీంతో యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేసింది.

పనులు చేసేందుకు ప్రయత్నం.. అడ్డుకున్న రైతులు

పెద్ద ధన్వాడలో ఇథనాల్‌‌ కంపెనీ ఏర్పాటుకు పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం సోమవారం అర్ధరాత్రి కంటెయినర్లు, జేసీబీలు, హిటాచీలు, బొలెరోలు, టిప్పర్లను ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం వద్దకు తీసుకొచ్చింది. ఈ విషయం కాస్తా 12 గ్రామాల ప్రజలతో పాటు ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీకి తెలియడంతో వారు మంగళవారం నిరసనకు దిగారు. బుధవారం ఉదయం ఆయా గ్రామాల ప్రజలంతా ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం వద్దకు వచ్చి సామగ్రిని ధ్వంసం చేశారు. సిబ్బంది ఉండేందుకు వేసుకున్న గుడిసెలు, కంటెయినర్లకు నిప్పు పెట్టారు.

టిప్పర్లు, బొలెరో వాహనాలను ధ్వంసం చేశారు. పనులు చేసేందుకు వచ్చిన సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. పచ్చటి పంట పొలాల మధ్య ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దంటూ రైతులు, ప్రజలు డిమాండ్‌‌ చేశారు. ఫ్యాక్టరీ నిర్మించొద్దని రెండేండ్ల నుంచి తాము పోరాటం చేస్తున్నా ఫ్యాక్టరీ యజమాన్యం మొండి పట్టుదలకు పోవడం సరికాదన్నారు. ఫ్యాక్టరీ నిర్మిస్తే 12 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, రోగాల బారిన పడుతారని, పంట పొలాలు బీడు బారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

పోలీసుల అదుపులో ఆందోళనకారులు

దాడి విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రజలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డీఎస్పీ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి గొడవలు, విధ్వంసం జరగకుండా పోలీస్‌‌ పికెటింగ్‌‌ ఏర్పాటు చేశారు. తర్వాత దాడికి దిగిన వారిలో కొందరిని అరెస్ట్‌‌ చేసి శాంతినగర్, రాజోలి, అయిజ, మానపాడు తదితర పోలీస్‌‌స్టేషన్లకు తరలించారు.

మానవపాడు స్టేషన్‌‌లో ఉన్న రైతులను అలంపూర్‌‌ ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. రైతులకు ఇష్టం లేకున్నా దౌర్జన్యంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. మూడు నెలల కిందే మంత్రి శ్రీధర్‌‌బాబును కలిశామని, ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేసి సహకరించాలని కోరామన్నారు. కంపెనీ యాజమాన్యం దౌర్జన్యంగా వచ్చి పనులు చేయడం తగదని మండిపడ్డారు. మరో వైపు పలువురు ప్రతిపక్ష లీడర్లు, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగానే హౌస్‌‌ అరెస్ట్‌‌ చేశారు.