
అరబిందో ఫార్మా లిమిటెడ్ 2019–20 ఆర్థిక సంవత్సరంలో విస్తరణకు రూ. 1,396 కోట్లు వెచ్చించనుంది. ఇది కాకుండా టర్నోవర్లో 5 శాతం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టనున్నారు. బయోసిమిలర్స్ మీద పెట్టుబడి పెద్దగా ఉండకపోవచ్చని అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. గోవిందరాజన్ వెల్లడించారు. కొన్ని ఫినిష్డ్ డోసేజ్లు, యాక్టివ్ ఫార్మా ఇన్గ్రీడియెంట్స్ (ఏపీఐ) ఉత్పత్తుల సామర్థ్యం పెంచేందుకు ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎనలిస్ట్ కాన్కాల్లో ఆయన తెలిపారు. డెర్మటాలజీ ఫార్ములేషన్స్ కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఉన్న కొన్ని ఏపీఐల సామర్థ్యం పెంచడంతోపాటు, భవిష్యత్లో అవసరమయ్యే కొన్ని ఏపీఐల ఉత్పత్తికి చొరవ తీసుకుంటున్నట్లు గోవిందరాజన్ పేర్కొన్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో అరబిందో ఫార్మా విస్తరణపై రూ. 1,571 కోట్లు, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై మరో రూ. 872 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తమకు కీలకమైనదని, ఎందుకంటే కనీసం రెండు బయోసిమిలర్స్ ఫేజ్ 1, ఒక బయోసిమిలర్ ఫేజ్ 3 మొదలు పెడతామని చెప్పారు. అమెరికాలో కొనుగోలు చేసిన శాండోజ్ ఇంక్ గురించి మాట్లాడుతూ, యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని, బహుశా 12 వారాలలో ఈ అనుమతులు రావొచ్చని అరబిందో ఫార్మా సీఎఫ్ఓ స్వామి అయ్యర్ వెల్లడించారు. ఎఫ్టీసీ అనుమతి చివరి దశలో ఉందని, మరికొన్ని ఫార్మాలిటీస్ నెరవేర్చాల్సి ఉందని అన్నారు. నొవార్టిస్ డివిజన్ అయిన శాండోజ్ ఇంక్ కొనుగోలుకు 2018 సెప్టెంబర్లో రూ. 6,285 కోట్లకు అరబిందో ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎక్విజిషన్ వల్ల 300 ప్రొడక్ట్స్, కొన్ని ప్రాజెక్టులు, అమెరికాలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు అరబిందో చేతికి వస్తున్నాయి.