చెన్నై: పగలు.. ప్రతీకారాలకు ఓ మైనర్ బాలిక బలైంది. తండ్రి మీద కోపంతో ఇద్దరు దుండగులు అతని 14 ఏండ్ల కూతురుపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ దారుణ సంఘటన తమిళనాడులో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వెల్లుపురం పట్టణ సమీపంలోని సిరిమదురాయ్ గ్రామానికి చెందిన కె.జయబాల్, కే కుమార్ సోదరులకు, నిందితుడు మురుగన్ కు మధ్య ఒక ఎకరం భూమి విషయమై కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మురుగన్ స్నేహితుడు జయబాల్ కిరాణ దుకాణానికి సిగరెట్ కొనే వంకతో వెళ్లి దుకాణంలో ఉన్న జయబాల్ కుమారుడు జయరాజ్ (17)పై దాడి చేశాడు.
ఈ ఘటనపై జయబాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన మురుగన్ తన మరో స్నేహితుడు కలియపెరుమాల్ తో కలిసి ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న జయబాల్ కూతురు జయశ్రీ (14)పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ బాలికు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆ బాలిక చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.