పెద్దపల్లి: స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదంటూ 15ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్కు చెందిన కంకణాల సింధుజ(15) అనే బాలిక తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. కరోనా నేపథ్యంలో ఇటీవల పాఠశాలలో 10వ తరగతికి ఆన్లైన్ తరగతులు ప్రారంభించటంతో అప్పుడప్పుడు తల్లి రజిత వద్ద ఉన్న సెల్ ఫోన్ నే వాడుకుంటోంది సింధుజ. అయితే, తనకు ప్రత్యేకంగా సెల్ ఫోన్ కావాలని పట్టుబట్టింది.
అడిగినప్పుడు తల్లి సెల్ ఫోన్ ఇవ్వడం లేదని దివ్యాంగురాలైన సింధుజ మానసికంగా కుంగిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. స్థానికులు సమాచారం మేరకు ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎన్టీపీసీ పోలీసులు విచారణ చేపట్టారు.