రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో టీఎస్ ఆర్టీసీ ఈ బస్సులను నడపనుంది. ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా అని పేరు పెట్టారు.
బస్సు ప్రత్యేకతలు
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో కలిపి మొత్తం 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ ఏర్పాటు చేసి దాన్ని టీఎస్ ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ప్రతి బస్సులో వైఫై సదుపాయంతో పాటు రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సు ముందు, వెనక భాగంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బోర్డుల్లో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం అందుబాటులోకి తెచ్చారు.