- అవయవదానం చేసిన18 నెలల పసికందు
- రెండు ప్రాణాలను నిలబెట్టిన చిన్నారి తల్లిదండ్రులు
- మరోఇద్దరికి పునర్జన్మనిచ్చిన ఎనిమిదేండ్ల పాప
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారుల అవయవాలు నాలుగు ప్రాణాలను నిలబెట్టాయి. హర్యానాలోని మేవాత్ కు చెందిన 18 నెలల బాలిక మహిరా ఈ నెల 6న ఇంట్లో బాల్కనీ నుంచి కిందపడి తలకు గాయమైంది. ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్కు తరలించగా, ఆ చిన్నారికి బ్రెయిన్ బాగా దెబ్బ తిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. చివరకు ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఆ పాప పేరెంట్స్ తో మాట్లాడి ఆర్గాన్ డొనేషన్కు ఒప్పించారు. అనంతరం మహిరా నుంచి సేకరించిన లివర్ను ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్లో చికిత్స పొందుతున్న ఆరు నెలల చిన్నారికి మార్పిడి చేశారు.
రెండు కిడ్నీలను ఎయిమ్స్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న 17 ఏళ్ల అబ్బాయికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. పాప కార్నియాలు, హార్ట్ వాల్వ్లను భద్రపర్చామని, తర్వాత అవసరమైన వారికి మార్పిడి చేస్తామని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారు. అలాగే, యూపీలోని మథురకు చెందిన 8 ఏండ్ల మానసి కూడా ఈ నెల 2న ఇంటి వద్ద ఎత్తు నుంచి కింద పడిపోయి తలకు గాయమైంది. ఈ పాప కూడా బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మానసి పేరెంట్ల అంగీకారంతో ఆమె లివర్, కిడ్నీని సేకరించి ఐదేండ్ల చిన్నారికి మార్పిడి చేశారు. మరో కిడ్నీని 12 ఏళ్ల అబ్బాయికి ట్రాన్స్ ప్లాంట్ చేశారు.