
న్యూఢిల్లీ : దోశ, ఇడ్లీ వంటివి చేయడానికి వాడుతున్న ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్స్ (రెడీ టూ కుక్ పిండి) పై 18 శాతం జీఎస్టీ వేయాలని గుజరాత్ అప్పిలెట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (జీఏఏఏఆర్) సూచించింది. గుజరాత్ కంపెనీ కిచెన్ ఎక్స్ప్రెస్ ఓవర్సీస్ లిమిటెడ్ జీఎస్టీ అధికారులు ఇచ్చిన డిమాండ్లను సవాలు చేస్తూ జీఏఏఏఆర్లో పిటీషన్ వేసింది. తమ ఏడు ‘ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్సెస్’ ప్రొడక్ట్లు రెడీ టూ ఈట్ ప్రొడక్ట్లు కావని ఈ కంపెనీ చెబుతోంది.
వీటిని వండడానికి మధ్యలో కొన్ని ప్రాసెస్లు ఉంటాయని తెలిపింది. తమ ప్రొడక్ట్లను రెడీ టూ కుక్ కేటగిరీ కింద చూడొచ్చని పేర్కొంది. తాము అమ్మే ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్సెస్ సత్తు పిండేనని, వీటిపై 5 శాతం ట్యాక్స్ వేయాలని కోరింది. కానీ, జీఏఏఏఆర్ ఈ వాదనను తిరస్కరించింది. ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్సెస్ను తయారు చేయడానికి వాడే ముడి పదార్ధాలు జీఎస్టీ రూల్స్ కిందకు రావడం లేదని, వీటిని సత్తు పిండితో పోల్చలేమని కామెంట్ చేసింది.