20శాతం ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచే పని చేస్తున్నరు : మంత్రి కేటీఆర్

20శాతం ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచే పని చేస్తున్నరు : మంత్రి కేటీఆర్

దేశంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 20% హైదరాబాదు నుంచే పనిచేస్తున్నారని, ఇది తెలంగాణకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని 2014లోనే చెప్పామని, గత 8ఏళ్లుగా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పారు. తొలినాళ్లలోనే ఐటీ పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడంపై దృష్టి సారించామన్నారు. అందుకే ప్రణాళిక బద్ధంగా హైదరాబాద్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, శాంతి భద్రతల బలోపేతం పాటు ఇన్నోవేషన్ ఈకో సిస్టంను మరింత అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ టీ హబ్ ను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. తర్వాత హైదరాబాద్ ఇన్నోవేషన్ ఈకో సిస్టంలో అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా వి హబ్ ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. దాంతోపాటు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా శానిటేషన్ హబ్ కూడా ఏర్పాటు చేశామన్న ఆయన.. త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైప్ సెంటర్ టీ వర్క్స్ ను ప్రారంభం చేయనున్నామని చెప్పారు.

హైదరాబాద్ లో ప్రస్తుతం ఇన్నోవేషన్ సిస్టం బలంగా ఉంది..

 దేశానికి గర్వకారణమైన అంతరిక్ష పరిశోధనలలో పనిచేస్తున్న స్కై రూట్, ధ్రువ వంటి స్టార్ట్ అప్ లు హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయమని, అవి విజయవంతంగా వృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఇన్నోవేషన్ సిస్టం బలంగా ఉందని, త్వరలో మరిన్ని స్టార్ట్ అప్స్ విజయం సాధిస్తాయన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఐటీ రంగంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య విషయానికొస్తే మొదటిసారి బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ దాటిందని గొప్పగా చెప్పారు. హైదరాబాద్ సాధించిన ఈ ఘనత తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆఫీస్ స్పేస్  వినియోగం విషయంలో బెంగళూరుని అనేక పర్యాయాలు హైదరాబాద్ దాటినా, అత్యధికంగా ఉద్యోగాలు  కల్పించిన నగరంగా నిలవడం గర్వకారణమన్నారు. 8 సంవత్సరాల కింద తాము ప్రారంభించిన టాస్క్ (TASK) ద్వారా 7 లక్షల మందికి పైగా యువకులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించామన్న ఆయన... ఈ శిక్షణ కేవలం ఐటీ రంగంలోనే కాకుండా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాల్లోనూ కొనసాగిందని తెలిపారు.

ఇంతటి ఘనత దేశంలో ఏ నగరానికి లేదు...

రాష్ట్రంలోని పదిలక్షల గృహాలకు ఇంటర్నెట్ ని అందించే టీ- ఫైబర్ ఈ సంవత్సరం పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 3వేలకు పైగా వైఫై, హాట్ స్పాట్ ల ద్వారా అందిస్తున్న వైఫై విజయవంతం అయిందని చెప్పారు. సమాజహితం కోసం పనికిరాని సాంకేతిక పరిజ్ఞానం వృథా అనే తమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు పనిచేస్తున్నామన్నారు. పౌరులకు సేవలందించే విషయంలో దేశంలోనే తెలంగాణ మీ-సేవా అత్యుత్తమమైనదిగా ఉందని చెప్పవచ్చన్నారు. పెన్షన్లు, డ్రైవింగ్ లైసెన్స్ ల రెన్యువల్, ఈ -ఓటింగ్ వంటి అనేక ప్రభుత్వ సేవలలో పెద్ద ఎత్తున నూతన టెక్నాలజీలను ఉపయోగించుకుంటున్న  ప్రభుత్వం తమదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల తో పాటు సోషల్ ఇన్ఫ్రా కూడా బాగా బలోపేతం అయిందన్న మంత్రి.. గత 8 సంవత్సరాలుగా ఒక నగరంలో అత్యధికంగా మౌలిక వసతులు కల్పించిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చన్నారు. ఇప్పటికే ఎస్ఆర్డీపీ ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని, త్వరలోనే హైదరాబాద్ నగరంలో సంపూర్ణ మురుగునీటి శుద్ధి వంద శాతం జరుగుతుందని, ఇంతటి ఘనత దేశంలో ఏ నగరానికి లేదని స్పష్టం చేశారు.

ఎక్కడ అభివృద్ధి చేయాలో మాకు తెలుసు..

2050 వరకు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతులను నిర్మాణం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోతో పాటు ఎయిర్ పోర్టు మెట్రో వంటి మరిన్ని ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఐటీ పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరించాలని చెప్పారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతోపాటు, తెలంగాణలోని ఇతర నగరాలకు కూడా ఐటీ పరిశ్రమ తీసుకుపోయే విషయంలో ఐటీ సంస్థలు ఆలోచన చేయాలని కోరారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఐటీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేసిందన్న ఆయన.. పలు జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ టవర్లను కూడా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటీ కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయని, వరంగల్ లో ఇప్పటికే పలు కంపెనీలు విజయవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో భారత దేశంలో మరిన్ని ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీల ద్వారా వచ్చే ఉద్యోగాల విషయంలో కంపెనీలు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని చెప్పారు. తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థ, అక్కడున్న విద్యార్థులతో ఐటీ కంపెనీలు పని చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ అభివృద్ధి చేయాలో తమకు తెలుసని, ఐటీ పరిశ్రమ ఉన్న ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామన్నమాట సరికాదని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకనుగుణంగానే అన్ని ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 300 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేసే ప్రయత్నం జీహెచ్ఎంసీ చేస్తోందన్నారు.