ఇంకొక్క రోజులోనే కొత్త బడ్జెట్
ఆసక్తిగా ఉన్న ప్రజానీకం
క్యాష్ సమస్య తీరేనా?
వెలుగు: దేశంలో వ్యాపారాలకు మంచి రోజులు కావివి. కొనుగోళ్లు తగ్గిపోయాయి. డిమాండ్ పడిపోయింది. కంపెనీలు కుయ్యో ముర్రో అంటున్నాయి. ఏమైనా కొందామంటే జర చేతిలో అసలు డబ్బులే ఉండటం లేదు. అంతగా క్యాష్ కొరత ఏర్పడింది. పెద్ద పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కుదేలయ్యాయి. బ్యాంక్లు అప్పులు ఇవ్వడం లేదు. అటు గ్లోబల్గా క్రూడాయిల్ ధరలు, బంగారం ధరలూ పెరిగిపోతూ, రూపాయి–డాలర్ ఎక్స్చేంజ్ విలువ భారీగా పడిపోతోంది. ఒకవైపు నుంచి కాకుండా అన్ని వైపుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమే కనిపిస్తోంది. ఇన్ని సమస్యల మధ్యన.. 2020 బడ్జెట్ వస్తోంది. మరి ఈ బడ్జెట్ అయినా దేశ ఆర్థిక వృద్ధిని పట్టాలెక్కిస్తుందా..? నిరుద్యోగానికి చెక్ పెడుతుందా..? కొనుగోళ్లను పెంచుతుందా? లేదా? చూడాల్సి ఉంది.
జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ల కిందకి, నిరుద్యోగం రేటు 40 ఏళ్ల పైకి చేరాయి. అంతేకాక ధరలు(డిసెంబర్ నుంచి ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది) కొండెక్కి కూర్చున్నాయి. కొనుగోళ్లు లేక జనం ఎక్కువగా వాడే ప్రొడక్ట్లు మొదలుకొని, ఆటో సెక్టార్ వరకు అన్ని కుదేలయ్యాయి. టూవీలర్ సేల్స్ కూడా పడిపోయాయంటే.. ఎకానమీలో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టేనని చాలా మంది ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. దేశ వృద్ధి రేటును గాడిన పెట్టడానికి ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు పలు స్కీమ్స్ ప్రకటించారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే, ఆర్థిక వృద్ధి పట్టాలెక్కించవచ్చని ఆర్థిక నిపుణులతో చర్చించి మరీ బడ్జెట్కు తుదిమెరుగులు దిద్దినట్టు తెలిసింది. వాటిలో కొన్ని…
గ్రోత్ను పెంచాలి….
పడిపోతున్న జీడీపీ వృద్ధి రేటుకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేటు 5 శాతానికి పడిపోతుందని ప్రభుత్వం అంచనావేసింది. ఐఎంఎఫ్ లాంటి సంస్థలు కూడా 2020లోనూ భారత వృద్ధి రేటు 4.8 శాతం ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. వృద్ధి రేటు ఇలా పడిపోతూ ఉంటే, ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని చేరుకోవడం చాలా కష్టమే. దీన్ని చేరుకోవాలంటే.. చాలానే చేయాల్సి ఉందని ఎక్స్పర్ట్లంటున్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రకటనలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు.
డిమాండ్కు బూస్టప్ ఇవ్వాలి…
మార్కెట్లో డిమాండ్ లేనిది.. ఏం చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. డిమాండ్ ఎలా పెంచాలన్న విషయంపై మొదట ఫోకస్ పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ రేట్లకు కోత పెట్టి, కంపెనీలకు సాయం చేసింది. అలానే పర్సనల్ ఇన్ కమ్ ట్యాక్స్ రేట్లను తగ్గించడం వల్ల, ప్రజల చేతుల్లో క్యాష్ పెరిగి, వినియోగాన్ని పెంచవచ్చు. అంతేకాక డిమాండ్ను పెంచే రంగాల్లో స్పెండింగ్ను పెంచాలి. రైతుల ఆదాయం పెరిగేందుకు కూడా స్కీమ్స్ తయారు చేయాలి. రూరల్ కన్జూమర్ల చేతిలో డబ్బు పడితే, వినియోగం మెరుగవుతుందని పలువురు ఎక్స్పర్ట్లు అభిప్రాయపడ్డారు.
క్యాష్కు కటకట…
మార్కెట్లో క్యాష్కు తీవ్ర కొరత ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు కుదేలవడంతో, మార్కెట్లోకి సరిపడ సొమ్ము రావడం లేదు. బ్యాంక్లు కూడా కొత్తగా అప్పులివ్వడానికి జంకుతున్నాయి. దీంతో క్యాష్ అవసరమున్న ఆటోలాంటి రంగాలు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. పంటలకు సరిపడా ధరలు లేకపోవడం, ఎంప్లాయిమెంట్ ప్రాబ్లమ్తో గ్రామీణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్యాష్ కొరతను తీర్చడానికి మార్కెట్లోకి క్యాపిటల్ ఇన్ ఫ్యూజన్ అవసరమని పలువురు ఎక్స్పర్స్ట్ చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ఎకానమీలో ఈ ఇన్ ఫ్యూజన్ ఎక్కువ అవసరమని పేర్కొంటున్నారు. బ్యాంక్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70 వేల కోట్ల వరకు ఫండ్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వం, బ్యాంకింగ్ రెగ్యులేటరీ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నాయి.
ఫైనాన్స్ సంస్థలకు ఊపిరొస్తుందా…?
నాన్ బ్యాంకింగ్ సెక్టార్లోని అప్పులిచ్చే కంపెనీలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు, ఈ బడ్జెట్లో పలు ప్రకటనలు చేస్తారని బ్యాంకింగ్ వర్గాలు చూస్తున్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్, డీహెచ్ఎఫ్ఎల్ వంటి పెద్ద కంపెనీలు దివాలా తీయడంతో ఎన్బీఎఫ్సీల సంక్షోభం మొదలైంది. ఎన్బీఎఫ్సీలు ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలంగా ఉంటున్నాయి. ఈ కంపెనీలకు నిధులు దొరకడం లేదు.
పన్ను వసూళ్లు…
కొనుగోళ్లు లేక, పన్ను వసూళ్లు కూడా తగ్గిపోయాయి. ప్రత్యక్ష పన్నుల నుంచి రూ.13.38 లక్షల కోట్లు వసూళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించుకుంటే.. అవి ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో రూ.5.56 లక్షల కోట్లే వసూలయ్యాయి. జీఎస్టీ టార్గెట్ రూ.6.63 లక్షల కోట్లు కాగా.. ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో రూ. 4.67 లక్షల కోట్లే ప్రభుత్వం కలెక్ట్ చేసింది. ఇక కస్టమ్స్ పరంగా చూసుకుంటే.. టార్గెట్ రూ.1.55 లక్షల కోట్లుంటే, కలెక్షన్లు రూ.75,933 కోట్లే ఉన్నాయి. సెంట్రల్ ఎక్సైజ్ల టార్గెట్ రూ.3 లక్షల కోట్లైతే… వసూళ్లు రూ.1.33 లక్షల కోట్లే.. ఇలా అన్నింటిల్లో పన్ను వసూళ్లు తగ్గిపోయాయి. ఇండియాలో 136 కోట్ల మంది జనాభా ఉంటే… వారిలో 8.45 కోట్ల మందే ఇన్కంట్యాక్స్ చెల్లించేవారున్నారు. దేశంలో 20 ఏళ్లలో మొట్టమొదటిసారి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లు
పడిపోవడాన్ని చూస్తోందని పలువురు సీనియర్ ట్యాక్స్ అధికారులు చెప్పారు. గ్రోత్ తగ్గడం, కార్పొరేట్ ట్యాక్స్ రేట్ల కోత వల్లే ఈ పరిణామం ఎదురవుతుందని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను తగ్గింపు మేరకు కొనుగోళ్లను పెంచి, పరోక్ష పన్నులు వసూలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎక్స్పర్స్ట్ సూచిస్తున్నారు.
ధరలు తగ్గించాలి..
డిసెంబర్ క్వార్టర్లో ద్రవ్యోల్బణం కొండెక్కిం ది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణం బాగా పెరిగి 7.35 శాతానికి చేరుకుంది. కూరగాయల ధరలు, ఉల్లి ధరల కాకతో ధరలు మండిపోయాయి. అంతేకాక ఈ మధ్యన అమెరికా–ఇరాన్ మధ్య గొడవలు… క్రూడాయిల్ ధరలకు రెక్కలు వచ్చేలా చేశాయి. ఆయిల్ ధరలు పెరగడం ఇన్డైరెక్ట్గా ఉత్పత్తి, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులను పెరగడంపై ప్రభావం చూపిస్తాయి. వీటి కాస్ట్లు పెరిగితే, ఆటోమేటిక్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి. బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలు ద్రవ్యోల్బణం అదుపులో ఉంచేలా ఉండాలి.
ఉద్యోగావకాశాలు పెంచాలి
దేశంలో నిరుద్యోగ రేటు 40 ఏళ్ల పైకి ఎగిసింది. రెండు కోట్ల మంది ప్రజలకు ఉద్యోగాలు లేవని ఇటీవల రిపోర్ట్ల్లో తెలిసింది. దీంతో ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయడం ఈ బడ్జెట్లో చాలా కీలకంగా మారింది. నిరుద్యోగ రేటు పెరుగుతుండటం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. కన్జూమర్ గూడ్స్ కంపెనీల అమ్మకాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటోంది. ఈ బడ్జెట్లో ఎంప్లాయిమెంట్కు కీలకంగా ఉన్న ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లపై ఎక్కువగా ప్రభుత్వం దృష్టిసారించాలని, వీటికి కేటాయింపులు పెంచాలని నిపుణులంటున్నారు.