శాకాంబరి ఉత్సవాల్లో పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు

శాకాంబరి ఉత్సవాల్లో పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ అర్చకులు చంద్రమౌళి శర్మ తెలిపారు. ఆలయ ఫౌండర్ ట్రస్ట్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన సతీమణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం అమ్మవారికి అభిషేకంతో పాటు ప్రతిష్టాపన మండపం, దేవతా పూజలు, మంత్రపుష్పం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అభిషేకంతో పాటు అమ్మవారికి హారతి, అర్చన కార్యక్రమం ఉంటుందని చంద్రమౌళి శర్మ తెలిపారు. 

మంత్రపుష్పంతో పాటు పల్లకి సేవ నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో 20 క్వింటాళ్ల పండ్లు, కూరగాయలతో అలంకరణ చేస్తామన్నారు.శుక్రవారం చివరి రోజు గుడికి వచ్చే భక్తులకు అలంకరణ చేసిన పండ్లు, కూరగాయలు పంచుతామని తెలిపారు. 8వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.