హైదరాబాద్, వెలుగు: చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్న పలువురిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) అరెస్ట్ చేసింది. ఇందులో ఇరిగేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ సహా 24 మందిని గురువారం (జనవరి 08) అదుపులోకి తీసుకుంది. సైబర్ టిప్ లైన్ ద్వారా అందిన 91 ఫిర్యాదుల ఆధారంగా ఐపీ అడ్రస్లను గుర్తించి, 18 స్పెషల్ టీమ్స్తో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లో 15 మందిని, వరంగల్లో ముగ్గురు, నిజామాబాద్లో ఇద్దరు సహా మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకుంది. వీరంతా చిన్నారుల అశ్లీల వీడియోలు చూడడంతో పాటు గూగుల్ డ్రైవ్లో వీడియోలను స్టోర్ చేసుకున్నట్టు గుర్తించింది.
చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్న వారిని ఆన్ లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్సప్లోయిటెటీవ్ అండ్ అబ్యుసివ్ మెటీరియల్(సీఎస్ఈఏఎం) గుర్తిస్తోంది. ఈ కేసు వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ శుక్రవారం వెల్లడించారు. 4 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్న చిన్నారుల అశ్లీల వీడియోలను బ్రౌజ్ చేసి డౌన్ లోడ్ చేసుకున్న వారి ఐపీ అడ్రస్లను చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సీపీయూ) సేకరించింది. సైబర్ టిప్ లైన్ ఫిర్యాదుల ఆధారంగా ఈ నెల మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించింది.
మైనర్లపై అశ్లీల కంటెంట్ను అప్లోడ్ చేయడం, భద్రపరచడం, ప్రసారం చేయడంపై టీజీ సీఎస్బీ.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో 24 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. నిజామాబాద్లో ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న ఉద్యోగి సహా మరికొంత మంది విదేశీ చిన్నారుల అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసి, డౌన్లోడ్ చేసినట్లు సీఎస్బీ అధికారులు గుర్తించారు.
అలాగే, రాజేంద్రనగర్లో సెక్యూరిటీ గార్డు గతంలో ఓ బాలికపై లైంగిక దాడి చేసి, ఆ వీడియోలు గూగూల్ డ్రైవ్లో స్టోర్ చేసుకున్నాడు. వాటిని సీఎస్ఈఎం సైబర్ టిప్లైన్ గుర్తించి, తెలంగాణ సైబర్ శాఖకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డును గుర్తించి పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పిల్లల అశ్లీల చిత్రాలను బ్రౌజ్ చేసిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు శిఖాగోయల్ తెలిపారు. కాగా, స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించిన సీఎస్బీ అధికారులను డీజీపీ శివధర్ రెడ్డి అభిందించారు.
