నామినేషన్ల స్క్రూటినీలో 30 మంది ఔట్

నామినేషన్ల స్క్రూటినీలో  30 మంది ఔట్
  • సరైన ఫార్మాట్​లో పత్రాలు సమర్పించని వారి నామినేషన్లు తిరస్కరణ
  • రేపటి వరకు విత్​ డ్రాకు చాన్స్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: రికార్డు స్థాయి నామినేషన్లతో హోరెత్తిన జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నిక బరిలో ఇప్పుడు వడపోత ప్రక్రియ మొదలైంది. బుధవారం నామినేషన్ల స్క్రూటినీ చేపట్టారు.  కాంగ్రెస్‌‌ తరఫున నవీన్‌‌ యాదవ్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ తరఫున మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్‌‌ అధికారి ఆమోదించారు. అయితే, సరైన పత్రాలు సమర్పించని కారణంగా దాదాపు 30 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.

 భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో.. బుధవారం ఉదయం నుంచి రిటర్నింగ్‌‌ అధికారి ఆఫీసులో స్క్రూటినీ ప్రక్రియ నడిచింది. సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం 69 మంది అభ్యర్థులకు చెందిన 131 నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా.. ఇందులో 39 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. 

సరైన ఫార్మాట్‌‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో 30 మంది అభ్యర్థులకు చెందిన 59 సెట్ల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల స్క్రూటినీ ఇంకా కొనసాగుతున్నందున, తిరస్కరణకు గురయ్యే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్‌‌ కుమార్‌‌ సింగ్‌‌ దగ్గరుండి పర్యవేక్షించారు. 

నిబంధనల ప్రకారం పకడ్బందీగా స్క్రూటినీ చేపట్టాలని  రిటర్నింగ్ అధికారి పి. సాయిరామ్​కు ఆయన సూచించారు. మరోవైపు, పోలీస్‌‌ పరిశీలకులు ఓం ప్రకాశ్‌‌ త్రిపాఠి.. నియోజకవర్గంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయన పలు క్రిటికల్‌‌ పోలింగ్‌‌ కేంద్రాలను, కోట్ల విజయభాస్కర్‌‌ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌‌, రిసెప్షన్‌‌, కౌంటింగ్‌‌  కేంద్రాన్ని, స్ట్రాంగ్‌‌ రూమ్‌‌ను తనిఖీ చేశారు. 

3భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉన్నందున, జూబ్లీహిల్స్‌‌ తుది బరిలో ఎంత మంది నిలుస్తారనే దానిపై అదేరోజు సాయంత్రానికి పూర్తి స్పష్టత రానుంది.