
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ కేసులు కొన్ని రోజులుగా భారీగా పెరిగిపోతున్నాయి. గత ఆరు రోజుల్లోనే మూడు రెట్లయ్యాయి. మార్చి 29న దేశవ్యాప్తంగా 1024 కేసులు ఉండగా.. ఇప్పుడు 3108కు చేరాయి. శుక్రవారం ఒక్కరోజే 508 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తంగా చేరగా 86 మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు నమోదయ్యాయి. తర్వాత తమిళనాడులో 411 మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత ఢిల్లీలో386, కేరళ 295, తెలంగాణ 229, రాజస్థాన్ 179, ఉత్తరప్రదేశ్ 174, ఆంధ్రప్రదేశ్ 164, మధ్యప్రదేవ్ 154,కర్ణాటక 128 కేసులు నమోదయ్యాయి.
వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..
- ముంబై ఎయిర్ పోర్టులో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లకు పాజిటివ్ వచ్చింది.
- రెండ్రోజులుగా దేశంలో నమోదైన కొవిడ్ పేషెంట్లలో 647 మంది మర్కజ్ సమావేశాలకు హాజరైనవాళ్లేనని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
- దేశంలో లాక్డౌన్ నేపథ్యంలో 35 రాష్ట్రాలు, యూటీల్లో ప్రజలకు సహాయం కోసం బీజేపీ 35 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది.
- పుణే షిరూర్ టౌన్ లో హోం క్వారంటైన్ లో ఉన్న 10 మంది శుక్రవారం పారిపోయారు. వారిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. వారు తబ్లిగి సభ్యులేనని కానీ మర్కజ్ సమావేశాలకు వెళ్లలేదని పోలీసులు చెప్పారు.
- తమిళనాడు నుంచి మర్కజ్ సమావేశాలకు హాజరైన 1,200 మందిని ట్రేస్ చేశామని, క్వారంటైన్లో ఉంచామని ఆ రాష్ట్ర అధికారులు చెప్పారు.
- కరోనాపై పోరుకు ఎంపీలు తమ ఎంపీలాడ్స్ నుంచి రూ. 365 కోట్లు డొనేట్ చేశారు. 74 మంది రాజ్యసభ సభ్యులు రూ. 100 కోట్లు, 265 మంది లోక్ సభ సభ్యులు రూ. 265 కోట్లు ఇచ్చారని రాజ్యసభ సెక్రటరీ పీపీకే రామాచార్యులు తెలిపారు.
- ఇండోర్ జిల్లా తాట్పట్టి బఖల్ ఏరియాలో హెల్త్ వర్కర్లపై దాడి చేసిన వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద శుక్రవారం కేసులు నమోదు చేశారు. కరోనా పేషెంట్ బంధువుల్ని క్వారంటైన్ లో ఉంచేందుకు వెళ్లిన హెల్త్ డిపార్ట్ మెంట్ టీమ్ పై కొంతమంది బుధవారం రాళ్లతో దాడి చేశారు.
- కేరళలో కన్నూర్లో ఐసోలేషన్ వార్డు నుంచి గురువారం ఖైదీ పరారయ్యాడు. జిల్లాలో కరోనా ఎక్కువగా ఉండటంతో ఖైదీని ఐసోలేషన్ లో ఉంచగా వార్డు ను తప్పించుకున్నాడు.
- పుదుచ్చేరిలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో డ్యూటీకి రాని 54 మంది స్టాఫ్ ను సస్పెండ్ చేశారు.