హైదరాబాద్ సిటీ, వెలుగు: పరీక్షా హాల్ అనగానే నిశ్శబ్దం, ఒత్తిడి, ఆందోళన సహజం. కానీ దీనికి భిన్నంగా చుట్టూ భారీ శబ్దంతో సంగీతం మార్మోగుతున్నా..ఏ మాత్రం చెదరకుండా వేలాది మంది చిన్నారులు ఆటపాటలతో ఎగ్జామ్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్లోని శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ త్రీలో ఆదివారం నిర్వహించిన ‘తెలంగాణ రీజినల్ ప్రాడిజీ ఛాంపియన్షిప్-2026’ లో ఈ వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది.
ఎస్ఐపీ (ఎస్ఐపీ) అబాకస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెంటల్ అర్థమెటిక్ పోటీల్లో ఐదు నుంచి 14 ఏండ్ల వయస్సున్న దాదాపు 3,200 మందికి పైగా చిన్నారులు పాల్గొని ప్రతిభను చాటారు. డిజిటల్ యుగంలో ఏకాగ్రతను నిలుపుకోవడం కష్టమని, అందుకే దృష్టి మరల్చే పరిస్థితుల్లోనూ పిల్లల ఏకాగ్రతను టెస్ట్చేయడానికి ఈ పరీక్ష నిర్వహించామని ఎస్ఐపీ అబాకస్ తెలంగాణ హెడ్ శ్రీ భరత్, సిప్ అకాడమీ సీనియర్ ప్రతినిధి ఉమా స్వామినాథన్ వివరించారు.
