కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద ఈగల్ ఫోర్స్, పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న రూ.1.65 కోట్ల విలువైన 331 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి కర్నాటకకు తరలిస్తుండగా, సూర్యాపేట–ఖమ్మం హైవేపై వెహికల్స్ను వెంబడించి గంజాయిని పట్టుకున్నారు.
ఒడిశాకు చెందిన డొండో అలియాస్ రాజు, కొర్ర లోకోన్, బురిడి సీతారాం, అంలంగి లైసెన్ ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేస్తున్నారు. డొండో 331 కిలోల గంజాయి అమ్మేందుకు కర్నాటకకు చెందిన ఎం.నాగరాజు, మనోజ్ కుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒడిశాలోని ఝాన్బా ప్రాంతంలో గంజాయి సేకరించి తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా, మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
