తెలంగాణకు 34 పోలీస్ మెడల్స్

 తెలంగాణకు 34  పోలీస్ మెడల్స్

న్యూఢిల్లీ, వెలుగు:  ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకొని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన పోలీస్ మెడల్స్ లో తెలంగాణకు 34 దక్కాయి. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలకు గాను 22 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ(పీఎంజీ), ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకం (పీపీఎం), మరో 10 మందికి పోలీస్​ విశిష్ట సేవా పతకాలు ( పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) దక్కాయి. 

అదనపు డీజీ విజయ్ కుమార్, ఎస్పీ మాదాడి రమణ కుమార్​ను రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వరించాయి. అలాగే ఎస్పీ భాస్కరన్, ఇన్ స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేశ్​, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కానిస్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్, కానిస్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేశ్​, మహేందర్ రావు, శివకుమార్ లు పోలీస్ గ్యాలంట్రీ అవార్డులు దక్కాయి. 

ఖైరతాబాద్ అదనపు ఎస్పీ బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీలు మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, ఆత్మకూరి వెంకటేశ్వరి,ఆర్ఎస్ఐలు ఆందోజు సత్యనారాయణ, కక్కెర్ల శ్రీనివాస్, మహంకాళి మధు, ఆర్ఐ అజెల్ల శ్రీనివాస రావు, సీనియర్ కమాండో రసమోని వెంకటయ్య, హైదరాబాద్ ఇన్స్ స్పెక్టర్ అరవేటి భాను ప్రసాద్ రావు, ఏఎస్ఐ సాయన వెంకటేశ్వర్లకు పోలీస్ సేవా పతకాలు దక్కాయి. అలాగే, లీడింగ్ ఫైర్ మ్యాన్ శ్రీనివాస్ కు ఫైర్ సర్వీస్ మెడల్ దక్కింది. హోంగార్డులు చీర్ల కృష్ణ సాగర్, కె సుందేర్ లాల్ లకు హోమ్ గార్డ్స్ అండ్​ సివిల్ డిఫెన్స్ మెడల్స్ వరించాయి. జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీహెచ్ కైలాశ్, హెడ్ వార్డర్ జీ మల్లారెడ్డికి ప్రతిభ పురస్కారాలు దక్కాయి.

దేశ వ్యాప్తంగా 954 మందికి..

దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో 229 మందికి పోలీసు గ్యాలంట్రీ, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా,642 మందికి పోలీసు సేవా పతకాలు దక్కాయి. ఏపీ నుంచి 29 మంది పోలీసులకు ఈ మెడల్స్​ దక్కాయి. ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం దక్కగా, 18 మందిని పోలీస్ గ్యాలంట్రీ, 10 మందిని విశిష్ట సేవా పతకాలు వరించాయి.