వచ్చే ఏడాది నుంచి టెన్త్ స్టూడెంట్లకు.. త్రీడి యానిమేషన్ మెటీరియల్: మంత్రి వాకిటి శ్రీహరి

వచ్చే ఏడాది నుంచి టెన్త్ స్టూడెంట్లకు.. త్రీడి యానిమేషన్ మెటీరియల్: మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి గవర్నమెంట్​ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు త్రీడి యానిమేషన్​ మెటీరియల్​ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు సీఎం రేవంత్​రెడ్డి సుముఖంగా ఉన్నారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి పాలమూరు జిల్లాకు వచ్చారు. ఆయనకు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, ముడా చైర్మన్​ లక్ష్మణ్​ యాదవ్, లైబ్రరీ చైర్మన్​ మల్లు నర్సింహారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. 

ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో ‘మహబూబ్​నగర్  ఫస్ట్’ నైపుణ్య అభివృద్ధి కేంద్రం, సెట్విన్  ద్వారా వివిధ స్వల్ప కాల కోర్సుల్లో శిక్షణ  పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువజన సర్వీసుల శాఖ పరిధిలోని సెట్విన్  ద్వారా పాలమూరులో మహిళలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను పైలెట్​ ప్రాజెక్ట్​గా తీసుకుంటామని తెలిపారు. ముందుగా ఉమ్మడి జిల్లాలో శిక్షణ ఇప్పించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. 

కార్యక్రమంలో కలెక్టర్  విజయేందిర బోయి, మైనార్టీ ఫైనాన్స్​ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా ఒలంపిక్​ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, ఏఎంసీ చైర్​పర్సన్​ బెక్కరి అనిత పాల్గొన్నారు.