
మహబూబ్నగర్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు త్రీడి యానిమేషన్ మెటీరియల్ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు సీఎం రేవంత్రెడ్డి సుముఖంగా ఉన్నారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి పాలమూరు జిల్లాకు వచ్చారు. ఆయనకు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ‘మహబూబ్నగర్ ఫస్ట్’ నైపుణ్య అభివృద్ధి కేంద్రం, సెట్విన్ ద్వారా వివిధ స్వల్ప కాల కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువజన సర్వీసుల శాఖ పరిధిలోని సెట్విన్ ద్వారా పాలమూరులో మహిళలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకుంటామని తెలిపారు. ముందుగా ఉమ్మడి జిల్లాలో శిక్షణ ఇప్పించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర బోయి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, ఏఎంసీ చైర్పర్సన్ బెక్కరి అనిత పాల్గొన్నారు.