సుప్రీంకోర్టు జడ్జీలకు కరోనా... 150మంది క్వారంటైన్

సుప్రీంకోర్టు జడ్జీలకు కరోనా... 150మంది క్వారంటైన్

భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, కోర్టుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు సైతం కోవిడ్ బారిన పడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో వైరస్ కేసులు నమోదు కావడంతో అక్కడ పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించారు. 150 స్టాప్ ను క్వారంటైన్ కు తరలించారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టీస్ సహా మొత్తం 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో నలుగురికి వైరస్ సోకడంతో కోర్టులో  పాజిటివిటీ రేటు 12.5 శాతం పెరిగింది. సుప్రీంకోర్టు అధికారిక సమాచారం ప్రకారం.. జ్వరం బాధపడుతున్న ఓ న్యాయమూర్తి .. జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫేర్ వెల్ పార్టీకి హాజరయ్యారు.  ఆ తర్వాత ఆ న్యాయమూర్తి కోవిడ్ బారిన పడ్డారు. 

మరోవైపు కరోనా వైరస్ పరిస్థితిపై గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సమావేశమయ్యారు. "దురదృష్టవశాత్తూ, మళ్లీ సమస్య మొదలైంది. మేం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. వచ్చే నాలుగు నుండి ఆరు వారాల వరకు మేము ఫిజికల్ మోడ్ ద్వారా కేసులను వినలేకపోవచ్చు" అని సిజెఐ చెప్పారు. భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సుప్రీం కోర్టు అలర్ట్ అయ్యింది. రెండు వారాల పాటు వర్చువల్ విచారణలు చేపడతామని పేర్కొంది. జనవరి 7 నుంచి ఈ నిబంధనలు జారీ చేశారు. 

అత్యంత అత్యవసరమైన అంశాలు, తాజా విషయాలు, బెయిల్ వ్యవహారాలు, స్టే, డిటెన్షన్ వ్యవహారాలు, నిర్ణీత తేదీ వ్యవహారాలు మాత్రమే కోర్టు చేపడుతుందన్నారు. మార్చి 2020 నుంచి కరోనా కారణంగా సుప్రీం కోర్టు వీడియో కాన్ఫరెన్స్  నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కేసులు కాస్త తగ్గడంతో అక్టోబర్ నుంచి భౌతిక విచారణలు చేపట్టింది. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండటంతో కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తామని కోర్టు తెలిపింది. మరోవైపు భారత్ లో కరోనా కేసులు లక్ష దాటుతున్నాయి. తాజాగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 327 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,90,611 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 10.21 శాతంగా ఉంది.