దరాబాద్, వెలుగు: నోటిఫికేషన్లో ప్రకటించిన అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేయడం టీఎస్పీఎస్సీకి ఇబ్బందిగా మారింది. కొన్ని పోస్టులకు అర్హులు లేకపోగా, వందలాది మంది అభ్యర్థులు రెండు పోస్టులకూ ఎంపికయ్యారు. వీరంతా ఒకే పోస్టును ఎంపిక చేసుకొని రెండో పోస్టు వదులుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేకపోయింది. ఏదో ఒక పోస్టు ఆర్డర్ ఇవ్వనిదే రెండో పోస్టు వదులుకునేది లేదని వారంతా చెబుతున్నారు. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టుల భర్తీకి 2017 అక్టోబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించింది. మెజార్టీ పోస్టులకు మెరిట్ లిస్ట్నూ ఇచ్చేసింది. కొన్ని స్కూల్ అసిస్టెంట్, నాన్ లాంగ్వేజీ ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసింది. 2,300 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 1,906 మంది, 720 నాన్ లాంగ్వేజీ ఎస్జీటీ పోస్టుల్లో 306 మంది పోస్టింగ్ ఆర్డర్స్ అందుకున్నారు. దీంతో మొత్తం 3,020 పోస్టుల్లో సుమారు 808 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులుగా మారాయి. తాజాగా ఎస్టీటీ పోస్టుల భర్తీకీ బ్యాక్ లాగ్ పోస్టుల గండం ఉండటంతో సెలెక్ట్ కానీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
రిలింక్విష్మెంట్కు 16 వరకూ అవకాశం
ఎస్టీటీ తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం పోస్టుల రిజల్ట్స్ను టీఎస్పీఎస్సీ వేర్వేరుగా ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 31న ఇంగ్లిష్ మీడియం పోస్టులకు సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఎస్టీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు, ఎస్టీటీ తెలుగు మీడియం పోస్టుల జాబితా నుంచి క్విట్ కావాలని టీఎస్పీఎస్సీ కోరింది. దీంతో 1:3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎంపికైన వారిలో కొందరే ఆ పోస్టుల్ని వదులుకున్నారు. ఏప్రిల్లో తెలుగు మీడియం పోస్టులకు సెలెక్టెడ్ లిస్టు విడుదల చేసింది. అయితే రిలింక్విష్మెంట్కు టీఎస్పీఎస్సీ మరో అవకాశమివ్వలేదు. ఈ రెండు పోస్టులకు ఎంపికైన వారు దాదాపు 600 మంది వరకూ ఉంటారు. లింక్విష్మెంట్కు అవకాశం లేకుంటే ఈ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేదు. దీంతో కొందరు అభ్యర్థులు రిలింక్విష్మెంట్
కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈనెల30లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, మళ్లీ కొత్త లిస్టు ప్రకటించాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 9 నుంచి 16 వరకూ టీఆర్టీలో ఎంపికైన అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరోసారి రిలింక్విష్మెంట్ కు అవకాశమిచ్చింది.
పోస్టింగ్ ఇస్తేనే..
ఎస్జీటీ తెలుగు, ఇంగ్లిష్ మీడియం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రీలింక్విష్మెంట్కు ముందుకు రావడం లేదు. ఏదైనా ఒక పోస్టుకు పోస్టింగ్ ఆర్డర్ అందుకుంటే, జాబ్ వచ్చిందనే భరోసా ఉంటుందనే భావనలో ఉన్నారు. ఇంగ్లిష్, తెలుగు మీడియం పోస్టుల కౌన్సిలింగ్లో దగ్గర ప్రాంతాన్ని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు. ఎస్ఏ అపాయిట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న వారిలో కొందరు ఎస్జీటీ, గురుకులాల్లో పోస్టులకు ఎంపికయ్యారు. వీరు కూడా ఏదో ఓ పోస్టును వదులుకునే అవకాశముంది.