
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.25 వేల లోపు రైతు రుణాల ఏక మొత్తం మాఫీ కింద రూ.1200 కోట్ల ను ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆరు లక్షల పది వేల మంది రైతులకు వెను వెంటనే వారి బ్యాంకు ఖాతాలో రుణ మొత్తాన్ని జమ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్య భవన్ లో ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు , వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు.
25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా చెల్లిస్తామని హరీశ్రావు తెలిపారు. దీంతో పాటు వానా కాల పంటకు రైతు బంధు సాయం పైన మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ మాసంలో వానాకాల పంటకు ఇవ్వాల్సిన రూ.7 వేల కోట్ల రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు కింద డబ్బులను వారి అక్కౌంట్లలో జమ చేయనున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గత క్యాబినెట్ లో నిర్ణయించిన ప్రకారం రైతు బంధు కింద 7 వేల కోట్లును ఈ నె ల రోజుల్లో పంట సీజన్ ఆరంభమయ్యే నాటి కల్లా రైతులకు అందించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఇతర ఖర్చులు తగ్గించుకోనైనా.. రైతులు పంటలు వేసే సమయానికన్నా ముందే రైతుల ఖాతాలలో డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కోటి 40 లక్షల ఎకరాలకు రైతు బంధు నిధులు చెల్లించడం జరిగిందన్నారు. 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు.
రైతులకు అందించే రుణమాఫీ మొత్తాలను వెంటనే వారి అక్కౌెంట్లలో జమ అయ్యే విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఇరువురు మంత్రులు సమీక్షా సమావేశంలో పాల్గొన్న బ్యాంకు అధికారులను ఆదేశించారు.