ఎంత డబ్బయినా ఇస్తా.. అతడిని చంపాల్సిందే..ప్రియుడి సూచనతో భర్తను హత్య చేయించిన భార్య

ఎంత డబ్బయినా ఇస్తా.. అతడిని చంపాల్సిందే..ప్రియుడి సూచనతో భర్తను హత్య చేయించిన భార్య
  • వివాహేతర సంబంధానికి అడ్డున్నాడని ప్రియుడి సూచనతో భర్తను హత్య చేయించిన భార్య
  • గద్వాల జిల్లాలో జరిగిన తేజేశ్వర్‌‌‌‌ హత్య కేసులో 8 మంది అరెస్ట్‌‌‌‌
  • నిందితుల్లో తల్లీకూతురు, తండ్రీకొడుకు

గద్వాల, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్‌‌‌‌ హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ‘ఎంత డబ్బయినా ఇస్తాను.. వాడిని చంపేయాల్సిందే’ అన్న ప్రియుడి సూచన మేరకు తేజేశ్వర్‌‌‌‌ భార్య ఐశ్వర్య సుపారీ గ్యాంగ్‌‌‌‌తో ఈ హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. కర్నూల్‌‌‌‌ పట్టణానికి చెందిన తిరుమల్‌‌‌‌రావు ఓ బ్యాంక్‌‌‌‌కు అనుబంధంగా పనిచేసే హోమ్‌‌‌‌లోన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ కంపెనీలో మేనేజర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు.

ఇదే ఆఫీస్‌‌‌‌లో పనిచేసే స్వీపర్‌‌‌‌ సుజాత ఆర్థిక అవసరాలు తీరుస్తుండడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తర్వాత సుజాత కూతురు ఐశ్వర్యతోనూ వివాహేతర సంబంధం పెట్టుకొని పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇదిలా ఉండగానే ఐశ్వర్యకు గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్‌‌‌‌తో డిసెంబర్‌‌‌‌లో ఎంగేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, గత నెలలో పెండ్లి జరిగింది. తర్వాత ఐశ్వర్య, తిరుమలరావు కలుసుకోసం కష్టంగా మారడంతో తేజేశ్వర్‌‌‌‌ను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తిరుమలరావు తనకు పరిచయం ఉన్న, హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌ ఏజెంట్‌‌‌‌గా పనిచేసే కుమ్మరి నాగేశ్‌‌‌‌ అనే వ్యక్తిని కలిసి హత్య గురించి చెప్పాడు. తేజేశ్వర్‌‌‌‌ను హత్య చేస్తే కావాల్సినంత డబ్బు ఇవ్వడంతో పాటు లోన్స్‌‌‌‌కు సంబంధించిన ఫైల్స్‌‌‌‌ను ఎప్పటికప్పుడు క్లియర్‌‌‌‌ చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో నాగేశ్‌‌‌‌, చాకలి పరశురాముడు, చాకలి రాజు, మోహన్‌‌‌‌, తిరుపతయ్యను కలిసి విషయం చెప్పాడు.

పొలాలు కావాలంటూ వచ్చి...

తిరుమల్‌‌‌‌రావుతో డీల్‌‌‌‌ కుదుర్చుకున్న సుపారీ గ్యాంగ్‌‌‌‌ తేజేశ్వర్‌‌‌‌ను హత్య చేసేందుకు స్కెచ్‌‌‌‌ వేశారు. ఇందులో భాగంగా తేజేశ్వర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేసి తాము హోమ్‌‌‌‌లోన్‌‌‌‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నామని, తమకు ఏమైనా స్థలాలు చూపిస్తే మంచి కమీషన్‌‌‌‌ ఇస్తామని నమ్మించారు. తర్వాత 17వ తేదీన కర్నూల్‌‌‌‌ నుంచి గద్వాలకు వచ్చిన గ్యాంగ్‌‌‌‌ సభ్యులు తేజేశ్వర్‌‌‌‌ను కారులో ఎక్కించుకొని మొగిలి రావల్‌‌‌‌ చెరువు శివారులోని ఓ పొలం వద్దకు వెళ్లారు.

అక్కడి నుంచి మరో ప్లేస్‌‌‌‌కు వెళ్తుండగా.. అప్పటితే తాము తెచ్చుకున్న కత్తులు, వేటకొడవళ్లతో కారులోనే తేజేశ్వర్‌‌‌‌ గొంతు కోసం హత్య చేశారు. డెడ్‌‌‌‌బాడీని సీటు కింద వేసుకొని ఎర్రవల్లి మీదుగా పంచ లింగాలకు చేరుకున్నారు. అక్కడ తిరుమల్‌‌‌‌రావును కలువగా అతడు కొత్త డ్రస్సులు, రూ. లక్ష ఇచ్చాడు. అక్కడి నుంచి నంద్యాల రోడ్డు వెంట వెళ్తూ పాణ్యం ఘాట్‌‌‌‌రోడ్డులో సుగానిమిట్ట వద్ద గల గాలేరు నగరి కెనాల్‌‌‌‌లో తేజేశ్వర్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీని పడేసి కర్నూలుకు వెళ్లిపోయారు. 

ఎనిమిది మంది అరెస్ట్‌‌‌‌

బయటకు వెళ్లిన తేజేశ్వర్‌‌‌‌ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు తేజేశ్వర్‌‌‌‌ హత్యకు గురైనట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీలు, ఇతర టెక్నికల్‌‌‌‌ ఎవిడెన్స్‌‌‌‌తో తిరుమల్‌‌‌‌రావు, ఐశ్వర్య కలిసే సుపారీ గ్యాంగ్‌‌‌‌తో తేజేశ్వర్‌‌‌‌ను హత్య చేయించినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో గురువారం తిరుమల్‌‌‌‌రావు, ఐశ్వర్యతో పాటు కుమ్మరి నాగేశ్‌‌‌‌, పరశురాముడు, రాజు, మోహన్‌‌‌‌, తిరుపతయ్య, సుజాతను అరెస్ట్‌‌‌‌ చేసి వారి వద్ద నుంచి కారు, రెండు వేట కొడవళ్లు, కత్తి, 10 మొబైల్స్‌‌‌‌, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సుజాత, ఐశ్వర్య తల్లీ కూతుళ్లు కాగా, తిరుమల్‌‌‌‌రావు, తిరుపతయ్య తండ్రీకొడుకులు.

నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. తేజేశ్వర్‌‌‌‌ను హత్య చేయకపోతే ఐశ్వర్య, తిరుమల్‌‌‌‌రావు కలిసి లద్దాఖ్‌‌‌‌ గానీ, అండమాన్‌‌‌‌కుగానీ పారిపోయేందుకు స్కెచ్‌‌‌‌ వేశారని ఎస్పీ వెల్లడించారు. తేజేశ్వర్‌‌‌‌ను హత్య చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించారని, ఇందులో భాగంగా అతడి బైక్‌‌‌‌కు జీపీఎస్‌‌‌‌ ట్రాక్టర్‌‌‌‌ను సైతం అమర్చారని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న ఎస్సైలు కల్యాణ్‌‌‌‌కుమార్‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌, శ్రీహరి, నందికర్‌‌‌‌ మల్లేశ్‌‌‌‌, స్వాతి, తేజస్వినిలతో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీనివాసులు ఉన్నారు.