బంగ్లాదేశ్​లో ట్రాలర్​ బోటు బోల్తా

బంగ్లాదేశ్​లో ట్రాలర్​ బోటు బోల్తా
  • ముగ్గురు పిల్లలు సహా 8మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్​ ఢాకాలో జరిగిన బోటు ప్రమాదంలో 8మంది మృతిచెందారు. 46మందితో ప్రయాణిస్తున్న ట్రాలర్​ బోటు పద్మనదిలో ఇసుక బోటును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢాకా డివిజన్ ​మున్షిగంజ్ ​జిల్లాలో శనివారం రాత్రి సుమారు 8.30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది మృతదేహాలను వెలికి తీశామని, ఇందులో నాలుగు డెడ్​బాడీలను స్థానిక ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. 

నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఫైర్​ సర్వీస్​, సివిల్ డిఫెన్స్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్​ ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో నిలిపివేశారు. ఈమేరకు ఢాకా ట్రిబ్యూన్​ న్యూస్​పేపర్​ వెల్లడించింది. సిర్జాదీఖాన్​కు చెందిన ప్యాసింజర్లు బోటులో పిక్నిక్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని, బోటులో ఉన్న చాలామంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని మున్షిగంజ్​ పోలీసులు​ తెలిపారు.